మౌంట్ మాంగనుయ్: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా అద్భుత విజయంతో చరిత్ర సృష్టించింది. ఐదు టీ20ల సిరీస్ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. కనివిని ఎరుగని రీతిలో సాగిన కోహ్లీసేన జైత్రయాత్ర.. అభిమానులకు కావాల్సిన మజానిచ్చింది. ముఖ్యంగా గత రెండు మ్యాచ్ ఫలితాలు సూపర్ ఓవర్తో తేలగా.. ఆఖరి మ్యాచ్ వాటికి తగ్గట్లుగానే సాగింది. పరిస్థితులతో సంబంధం లేకుండా ఆఖరి బంతి వరకు పోరాడిన భారత్ 7 పరుగులతో అద్భుత విజయాన్నందుకుంది. ఇక తమకు అలవాటైన రీతిలో ఒత్తిడి జయించలేక ఆతిథ్య జట్టు గెలుపు ముంగిట బోల్తా పడింది.
India vs New Zealand 5th T20I: కివీస్ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన భారత్
అయితే ఈ మ్యాచ్కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోగా.. రోహిత్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. బ్యాటింగ్లో అద్భుతంగా రాణించిన అతను దురదృష్టవశాత్తు చీలిమండ గాయంతో అర్థాంతరంగా వైదొలిగాడు. దీంతో వైస్ కెప్టెన్సీ హోదాలో కేఎల్ రాహుల్ టీమ్ను లీడ్ చేశాడు. అద్భుత కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. వికెట్ల వెనుకాల ఉంటూ ఫీల్డింగ్ పోజిషన్లు మారుస్తూ ఓడిపోయే మ్యాచ్ను కూడా తన అద్భుత కెప్టెన్సీతో గెలపించాడు. ఇండియాకు ఉన్న అద్భుత బౌలింగ్ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు.
India vs New Zealand 5th T20I: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్
మూడో టీ20లో గాయపడ్డ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చివరి మ్యాచ్లో కూడా బరిలోకి దిగలేదు. ఇక విశ్రాంతిలో ఉన్న కోహ్లీ.. రిజర్వ్ బెంచ్ ఆటగాడు రిషబ్ పంత్తో కలిసి వాటర్ బాయ్ అవతారం ఎత్తగా.. న్యూజిలాండ్ తరఫున విలియమ్సన్ కూడా వాటర్ అందించాడు. ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ముగ్గురు బౌండరీ లైన్ దగ్గరు కూర్చున్నారు. ఈ సందర్భాన్ని కెమెరాలు క్లిక్మనిపించగా.. బీసీసీఐ 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్'అనే క్యాప్షన్తో ట్వీట్ చేసింది.
#SpiritOfCricket 🙌🙌#NZvIND pic.twitter.com/97kkQP8y02
— BCCI (@BCCI) February 2, 2020
ఇక అభిమానులు సైతం ఈ ఫొటోను చూసి ప్రశంసలు కురిపిస్తున్నాడు. ది బెస్ట్ కెప్టెన్స్ అని ఒకరంటే.. మోస్ట్ ఎక్స్పీరియన్స్ వాటర్ బాయ్స్ అని మరొకరు కామెంట్ చేశారు. ఇక ఈ ఫొటో ఐసీసీ కవర్ పిక్ అవుతుందని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఫన్నీ క్యాప్షన్స్తో ట్వీట్ చేస్తున్నారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (60 రిటైర్డ్ హర్ట్) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ (45) తన ఫామ్ను కొనసాగించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో కుగ్లిన్ రెండు వికెట్లు తీయగా.. బెన్నెట్ ఒక వికెట్ తీశాడు.
అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసి ఓటమి పాలైంది టిమ్ సీఫెర్ట్(50), రాస్ టేలర్(52 ) అద్భుత ప్రదర్శన కనబర్చినా ఫలితం లేకపోయింది.
భారత బౌలర్లలో బుమ్రా (3/12) మూడు వికెట్లు తీయగా.. సైనీ, ఠాకుర్ రెండేసి వికెట్ల పడగొట్టారు. ఇక సుందర్కు ఒక వికెట్ దక్కింది. సిరీస్ ఆసాంతం ఆకట్టుకున్న కేఎల్ రాహుల్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వరించగా.. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.