
హైదరాబాద్: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదో వన్డే వెల్లింగ్టన్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తుది జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. తొడ కండరాల గాయం కారణంగా మూడు, నాలుగు వన్డేలకి దూరమైన ధోని ఫిట్నెస్ సాధించడంతో మళ్లీ తుది జట్టులోకి వచ్చాడు.
దీంతో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ రిజర్వ్ బెంచ్కి పరిమితమవగా.. ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో మహ్మద్ షమీ, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయపడిన ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ స్థానంలో కొలిన్ మున్రో జట్టులోకి వచ్చాడు.
ఐదు వన్డేల సిరీస్లో ఇప్పటికే నాలుగు వన్డేలు ముగియగా ప్రస్తుతం 3-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా గెలుపుతో సిరీస్ని ముగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు గత గురువారం జరిగిన నాలుగో వన్డేలో అనూహ్యంగా విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్ జట్టు సొంతగడ్డపై ఆఖరి వన్డేలో గెలిచి 2-3తో పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.
జట్ల వివరాలు:
భారత్: రోహిత్శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, అంబటిరాయుడు, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, విజయ్శంకర్, భువనేశ్వర్కుమార్, మహమ్మద్ షమీ, యజువేంద్ర చాహల్.
న్యూజిలాండ్: హన్రీ నికోల్స్, కొలిన్ మన్రో, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, కోలిన్ డీ గ్రాండ్హోమ్, టాడ్ ఆస్టిల్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్.