హైదరాబాద్ : సునాయసంగా గెలిచే మ్యాచ్లో న్యూజిలాండ్ మరోసారి తడబడింది. సూపర్ ఓవర్కు దారితీసిన మ్యాచ్లో ఆతిథ్య జట్టుకు మరో చేదు అనుభవమే మిగిలింది. ఇప్పటికే 6 సూపర్ ఓవర్లలో ఓడిన ఆ జట్టు మరో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఇక గెలుపు ముంగిట నిలిచిన ఆ జట్టును.. యువ పేసర్ శార్థుల్ ఠాకుర్ అద్భుతంగా కట్టడి చేశాడు. చివరి ఓవర్లో విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన సమయంలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి సూపర్ ఓవర్కు దారి తీశాడు. గత మ్యాచ్లో మహ్మద్ షమీ అద్భుతం చేస్తే.. ఈ మ్యాచ్లో ఠాకుర్ అంతకు మించి ఆకట్టుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్లో భారత్ గెలవడానికి.. ఆతిథ్య జట్టు ఓటమికి ప్రధాన కారణం,మాత్రం సీఫెర్ట్ రనౌట్. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఈ మ్యాచ్లో సీఫెర్ట్(39 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే చివరి ఓవర్లో నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న అతనికి మళ్లీ స్ట్రైకింగ్ తీసుకునే అవకాశం రాలేదు. ఇదే న్యూజిలాండ్ కొంప ముంచింది. సూపర్ ఓవర్కు దారితీసింది. వెరసి అలవోకగా గెలిచే మ్యాచ్ చేజారింది.
శార్థుల్ వేసిన తొలి బంతికే టేలర్ను ఔట్ చేసిన ఠాకుర్ భారత శిభిరంలో ఆశలు రెకెత్తించాడు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన డార్లీ మిచెల్ బౌండరీ కొట్టడంతో ఇక కివీస్ గెలిచిందిలే అనుకున్నారు. కానీ ఇక్కడే ఠాకుర్ అద్భుతం చేశాడు. మరుసటి బంతి మిచెల్ బ్యాట్కు తగలకున్నా రన్ తీసే ప్రయత్నం చేయగా.. నాన్ స్ట్రైకర్ సీఫెర్ట్ను కీపర్ రాహుల్ రనౌట్ చేశాడు. ఆ మరుసటి బంతికి క్రీజులోకి వచ్చిన సాంట్నర్ సింగిల్ తీయగా.. ఐదో బంతికి మిచెల్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. ఇక చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా.. సాంట్నర్ డీప్ పాయింట్ మీదుగా స్వీప్ చేసి రెండో పరుగు తీసే ప్రయత్నంలో రనౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాచ్ టై అయింది.
సూపర్ ఓవర్లో కివీస్ 13 పరుగులు చేయగా.. భారత్ ఒక్క బంతి మిగిలి ఉండగానే 16 పరుగులు చేసి విజయాన్నందుకుంది. దీంతో ఐదు టీ20ల సిరీస్లో భారత్ 4-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక చివరి టీ20 ఆదివారం మౌంట్ మాంగనూయి వేదికగా జరగనుంది.