
హైదరాబాద్: ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పుజారాను తప్పించి టీమిండియా తగిన మూల్యం చెల్లించుకున్న సంగతి తెలిసిందే. కచ్చితంగా గెలుస్తుందని అనుకున్న మ్యాచ్లో భారత్ బ్యాట్స్మెన్ విఫలం కావడంతో చివరకు 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ నేపథ్యంలో పుజారాను పక్కకు పెట్టడాన్ని ఇప్పటికే సీనియర్ క్రికెటర్లు, అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు తప్పుబట్టారు. బ్యాట్స్మెన్ ఆడుతున్నప్పటికీ, కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీ ఆలోచనలు మారాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో లార్డ్స్ వేదికగా జరిగే రెండో టెస్టులో ఆడే తుది జట్టుపై చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ట్విట్టర్లో ఓ ఫన్నీ ట్వీట్ చేశాడు. పోప్ ఇంగ్లాండ్ తరపున బరిలోకి దిగుతున్నాడు.. మరీ రెండో టెస్ట్లో పుజారా ఆడుతాడా? అంటూ ట్వీట్టర్ ద్వారా ప్రశ్నించాడు.
ఇందుకు భారత క్రికెట్ అభిమానులు 100 శాతం ఆడుతాడని సమాధానమివ్వడం విశేషం. మరి కొందరైతే పుజారాతో పాటు రిషబ్ పంత్కు కూడా అవకాశం ఇవ్వాలని, శిఖర్ ధావన్ను పక్కన పెట్టాలని సూచించారు. తొలి టెస్టులో పుజారాని ఎంపిక చేయలేదో అర్థం కావడం లేదని, అతడు ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నారు.
తొలి టెస్టులో ఒక్క కోహ్లీ మినహా బ్యాట్స్మెన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో టెస్టు క్రికెట్లో పుజారా అవసరం ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చింది. పుజారా ఆడిన 58 టెస్టుల్లో భారత్ 33 మ్యాచ్ల్లో విజయం సాధించగా... 12 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. మరో 13 మ్యాచ్లు డ్రా అయ్యాయి.
ఇదిలా ఉంటే ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య లార్డ్స్ వేదికగా ఆగస్టు 9 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.