
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నాడు. గత రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
తాజాగా, మూడో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలవనున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లాండ్లో పర్యటిస్తోంది.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా రెండో టెస్టు శుక్రవారం ఆరంభమైంది. తొలిరోజు వర్షం కారణంగా పూర్తి ఆట రద్దయిన సంగతి తెలిసిందే. ఇక, రెండో రోజైన శుక్రవారం టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ కోహ్లీసేనను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
రెండో రోజు ఆటలో భాగంగా కోహ్లీ 23 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. దీంతో ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ అంటే టెస్టు, వన్డే, టీ20ల్లో కలిపి కోహ్లీ చేసిన పరుగులు 1,404. టెస్టుల్లో 509 పరుగులు చేసిన కోహ్లీ టీ20ల్లో 146, వన్డేల్లో 749 పరుగులతో ఉన్నాడు.
దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఆగస్టు 10 (శుక్రవారం) నాటికి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో 2,595 పరుగులతో, 2017లో 2,818 పరుగులతో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
వరుసగా మూడో ఏడాది కూడా అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో నిలుస్తాడా లేదో తెలియాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో
ఆండర్సన్ చెలరేగడంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 107 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
తొలి రోజులాగే రెండో రోజు కూడా మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో రెండు సెషన్లలో కేవలం 8.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం దోబూచులాడిన రెండో రోజు ఆఖరి ఇన్నింగ్స్ మాత్రమే పూర్తిగా సాగగా ఇంగ్లండ్ పేసర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగారు.
ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్ (5/20) ధాటికి భారత్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్ (29) మాత్రమే టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో బౌలర్ క్రిస్ వోక్స్కు రెండు వికెట్లు దక్కాయి.