ఆటగాళ్ల బ్యాటింగ్ తీసికట్టుగా మారింది
ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం పూర్తిగా సన్నగిల్లడంతోనే వారి బ్యాటింగ్ తీసికట్టుగా మారిందన్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన బాధ్యత కోచ్లదేనని ఇండియాటీవికి ఇచ్చిన ఇంటర్యూలో గంగూలీ స్పష్టం చేశాడు.
కోహ్లీ మాత్రమే రాణిస్తున్నాడు
"ఇంగ్లాండ్ గడ్డపై విరాట్ కోహ్లీ మాత్రమే రాణిస్తున్నాడు. జట్టులో మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లు ఎందుకు బ్యాటింగ్లో వరుసగా విఫలమవుతున్నారు? ఈ ప్రశ్నకి సరైన సమాధానం దొరక్కపోతే.. భారత్ జట్టు ఎప్పటికీ దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్లను గెలవలేదు" అని గంగూలీ అన్నాడు.
వరుసగా సిరీస్లను చేజార్చున్న భారత్
"2011 నుంచి చూస్తే ఈ మూడు దేశాల్లో భారత్ జట్టు వరుసగా సిరీస్లను చేజార్చుకుంటూనే వస్తోంది. విరాట్ కోహ్లీ చక్కగా ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొంటున్నాడు. కానీ.. మిగతా వాళ్లు తడబడుతున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లినట్లు కనిపిస్తోంది. గతంలో పుజారా, రహానే బాగా ఆడారు" అని గంగూలీ అన్నాడు.
ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత కోచ్లదే
"ఈ సిరీస్లో వాళ్లు కూడా ఒత్తిడిలోనే కనిపిస్తున్నారు. ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత కోచ్లది. వారు విఫలమయ్యారు. కాబట్టి.. తాజా టెస్టు సిరీస్ ఓటమికి వారు బాధ్యత వహించాలి" అని గంగూలీ అన్నాడు. ఇరు జట్ల మధ్య ఈ సిరిస్లో ఆఖరి టెస్టు శుక్రవారం నుంచి ఓవల్ వేదికగా జరగనుంది.