లండన్: స్పిన్ పిచ్ల గురించి ఫస్ట్ టెస్ట్లోనే తనకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వార్నింగ్ ఇచ్చాడని ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాట్స్మన్ ఓలీ పోప్ తాజాగా వెల్లడించాడు.
ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్.. నాలుగు టెస్టులు, ఐదు టీ20ల సిరీస్తో పాటు మూడు వన్డేల సిరీస్ను కూడా కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే.. టూర్ ఆరంభంలోనే అదీ ఫస్ట్ టెస్టులోనే విరాట్ కోహ్లీ తనకి పిచ్ విషయంలో వార్నింగ్ ఇచ్చినట్లు ఓలీ పోప్ చెప్పుకొచ్చాడు.
'తొలి టెస్టులో నేను నాన్స్ట్రైక్ ఎండ్లో ఉండగా.. విరాట్ కోహ్లీ నా దగ్గరికి వచ్చి.. ఇదే చివరి ప్లాట్ పిచ్ అని హెచ్చరించాడు. దాంతో.. ఇక సిరీస్లో మాకు బ్యాటింగ్ పరంగా సవాళ్లు ఎదురుకాబోతున్నాయనే విషయం అప్పుడే నాకు అర్థమైపోయింది'అని ఓలీ పోప్ వెల్లడించాడు. ఆ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 34 పరుగులు చేసిన ఓలీ పోప్.. రెండో ఇన్నింగ్స్లో 28 పరుగులు చేశాడు. ఈ రెండు ఇన్నింగ్స్ల్లోనూ అతను స్పిన్నర్ల బౌలింగ్లోనే ఔటయ్యాడు.
ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా ఫస్ట్ టెస్టు జరగగా.. ప్లాట్ పిచ్పై చెలరేగిపోయిన ఇంగ్లండ్ టీమ్ భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు కెప్టెన్ జో రూట్ (218) డబుల్ సెంచరీ బాదేశాడు. అయితే.. అదే పిచ్పై భారత బ్యాట్స్మెన్లు తడబడగా.. ఇంగ్లండ్ ఏకంగా 277 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. కానీ.. ఆ తర్వాత మూడు టెస్టుల్లోనూ టీమిండియా 317 పరుగుల తేడాతో, 10 వికెట్ల తేడాతో, ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని టెస్టు సిరీస్ని 3-1తో సొంతం చేసుకుంది. తొలి టెస్టు తర్వాత ఇంగ్లండ్ని స్పిన్ ఉచ్చులో బిగించిన భారత్.. ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు.