అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరుగుతున్న డే/నైట్ టెస్ట్లో భారత్ స్వల్ప ఆధిక్యానికే పరిమితమైంది. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్(5/8), స్పిన్నర్ జాక్ లీచ్(4/54) బంతితో చెలరేగడంతో కోహ్లీసేన 145 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ(96 బంతుల్లో 11 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీ మినహా అంతా విఫలమయ్యారు. దాంతో భారత్కు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. 99/3 ఓవర్నైట్ స్కోర్తో గురువారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ కేవలం 46 పరుగుల మాత్రమే జోడించి మిగతా ఏడు వికెట్లు చేజార్చుకుంది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ అజింక్యా రహానే(25 బంతుల్లో 7), రోహిత్ శర్మ(96 బంతుల్లో 11 ఫోర్లతో 66), వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్(8 బంతుల్లో 1), సుందర్(0), అక్షర్ పటేల్(0), రవిచంద్రన్ అశ్విన్(17) వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. చివర్లో ఇషాంత్(10) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా బుమ్రా(1) ఔటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
రహానే, రోహిత్లను తన వరుస ఓవర్లలో జాక్ లీచ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చగా.. రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్(0), అక్షర్ పటేల్, అశ్విన్, బుమ్రాలను ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ వెనక్కి పంపాడు. రోహిత్ శర్మ రివ్యూ తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. జాక్ లీచ్ వేసిన 41 ఓవర్ తొలి బంతిని స్వీప్ షాట్ ఆడబోయిన రోహిత్ అంచనా తప్పింది. దాంతో బంతి బ్యాట్ను మిస్సై శరీరానికి తాకింది. ఎల్బీ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. రోహిత్ సమీక్షకు వెళ్లగా అంపైర్స్ కాల్గా తేలింది. దాంతో హిట్ మ్యాన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత భారత్ టప టపా వికెట్లు కోల్పోయింది. జోరూట్ బౌలింగ్లో పంత్ కీపర్ క్యాచ్గా.. వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ గోల్డెన్ డక్గా పెవిలియన్ బాట పట్టాడు.
అశ్విన్ కొంత పోరాడినా.. జోరూట్ దెబ్బకు వెనుదిరగక తప్పలేదు. ఆ తర్వాత ఇషాంత్ ఓ భారీ సిక్సర్తో దూకుడు కనబర్చాడు. కొత్తగా నిర్మితమైన ఈ మొతెర స్టేడియంలో ఇషాంత్ శర్మ ఫస్ట్ సిక్స్ కావడం విశేషం. అయితే బుమ్రాను జోరూట్ వికెట్లు ముందు బోల్తాకొట్టించాడు.