46 వన్డేల్లో గెలిచి.. 19 వన్డేల్లో మాత్రమే ఓడి
ఇటీవల ఇంగ్లాండ్ గడ్డపై ముగిసిన మూడు టీ20ల సిరీస్ని 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్లో ఇంగ్లాండ్ను ఢీకొట్టబోతోంది. టీ20 ఫార్మాట్తో పోలిస్తే.. వన్డేల్లో ఇంగ్లాండ్ ప్రమాదకర జట్టు. ఇంగ్లాండ్ 46 వన్డేల్లో గెలిచి కేవలం 19 వన్డేల్లో మాత్రమే ఓడిపోయింది. 2015 ప్రపంచకప్ తర్వాత వన్డేల్లో పూర్తి భిన్నమైన ఆటను ప్రదర్శిస్తున్న ఇంగ్లాండ్ చివరగా పూర్తి సిరీస్ ఓడింది భారత్ చేతిలోనే.
481 పరుగులతో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు
2017 జనవరిలో సొంతగడ్డపై భారత్పై సిరీస్ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లాండ్ కోల్పోలేదు. ఈ మధ్యనే ఆస్ట్రేలియాతో 5 వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. పాకిస్థాన్తో గత నెల జరిగిన వన్డే సిరీస్లో ఏకంగా 481 పరుగులతో ఇంగ్లాండ్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఏడాది వ్యవధిలోనే అదీ.. రెండు సార్లు ఆ జట్టు వన్డేల్లో భారీ స్కోరుతో ప్రపంచ రికార్డుల్ని బద్దలుకొట్టడం విశేషం.
శిఖర్ ధావన్ ఫామ్పై జట్టులో ఆందోళన
టీ20 సిరీస్లో మెరుపు సెంచరీలు బాదిన ఓపెనర్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వన్డేల్లోనూ అదే జోరుని కొనసాగించాలని భారత్ ఆశిస్తోంది. అయితే.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ జట్టులో ఆందోళన పెంచుతోంది. భారీ స్కోర్లతో సవాల్ విసిరే ఇంగ్లాండ్కి గట్టి పోటీనివ్వాలంటే.. తొలుత జట్టుకి ఓపెనింగ్ జోడి మెరుగైన ఆరంభమివ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ధావన్ ఫామ్ అందుకోగలిగితే.. బ్యాట్ ఝళిపించే అవకాశం ఉంటుంది.
కోహ్లి స్థానం మార్చుకుని 4లో వస్తాడా..:
జట్టు కూర్పే టీమ్ఇండియాకు సమస్యగా పరిణమించింది. అద్భుత ఫామ్లో ఉన్న రాహుల్కు చోటివ్వాలా.. ఇస్తే ఎక్కడ..? అన్నదే ఇప్పుడున్న చిక్కు ప్రశ్న. దీనికి పరిష్కారంగా కెప్టెన్ కోహ్లి తన స్థానాన్ని రాహుల్కు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రోహిత్, ధావన్ ఓపెనర్లుగా రావడం ఖాయం! అదే స్థానానికి పోటీపడుతున్న రాహుల్ను మూడులో బ్యాటింగ్కు పంపాలని జట్టు వ్యూహ బృందం ఆలోచిస్తోంది. అందుకు కోహ్లి ఒక స్థానం దిగి నాలుగులో బ్యాటింగ్ చేసుందుకు సిద్ధమవుతున్నాడు! ఇక రైనా, ధోని, హార్ధిక్లు మిడిలార్డర్ను పంచుకోనున్నారు.
పుంజుకున్న టీమిండియా బౌలర్లు
బౌలింగ్లోనూ భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ ఇప్పటికే లయ అందుకోగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ ఇప్పటికే అక్కడి పరిస్థితులకి అలవాటు పడ్డారు. అదనపు పేసర్ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తే భువనేశ్వర్, ఉమేశ్లకు తోడుగా శార్దుల్ లేదా సిద్ధార్థ్ కౌల్ తుది జట్టులోకి ఎంపికకావచ్చు. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ సొంతం చేసుకుని టెస్టులకు ముందు ఆ జట్టు విశ్వాసాన్ని దెబ్బతీయాలని పట్టుదలగా ఉంది కోహ్లి బృందం. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి తొలి వన్డే ప్రారంభంకానుంది.