న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన టీమిండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్టులందరూ మార్చి 1 కల్లా అహ్మదాబాద్లో రిపోర్ట్ చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదేశించింది. మార్చి 12 నుంచి మొదలయ్యే సిరీస్లోని ఐదు టీ20 మ్యాచ్లు మొతెరాలోనే జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం బీసీసీఐ 19 మంది సభ్యుల జట్టును కూడా ప్రకటించింది. ఇందులో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సహా పలువురు ప్లేయర్లు ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. అయితే బోర్డు ఆదేశాలతో ధవన్తో పాటు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషాన్, సూర్య కుమార్ యాదవ్, రాహుల్ తెవాటియా, చహల్ తదితరులు రాబోయే సోమవారం కల్లా అహ్మదాబాద్ చేరుకోనున్నారు. విజయ్ హజారే కోసం వీరంతా ప్రస్తుతం బయోబబుల్లోనే ఉన్నారు. కానీ అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత ప్రోటో కాల్స్ ప్రకారం జట్టుతో కలుస్తారు.
కోహ్లీ సేన పింక్ ప్రాక్టీస్
ఇంగ్లండ్తో బుధవారం నుంచి మొదలయ్యే పింక్ బాల్ టెస్ట్ కోసం కోహ్లీసేన ఆదివారం నెట్స్లో తీవ్రంగా శ్రమించింది. గ్రౌండ్లో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు, ఫీల్డింగ్ డ్రిల్స్ చేసిన ప్లేయర్లు ఆ తర్వాత నెట్స్లో చెమటోడ్చారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానె, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ వీళ్లకి పింక్ బాల్తో బౌలింగ్ చేశారు. ఇక, కెరీర్లో 100వ టెస్ట్ ఆడనున్న ఇషాంత్ శర్మ కూడా చాలా సేపు బౌలింగ్ చేశాడు. చెన్నైలో జరిగిన తొలి రెండు టెస్ట్ల్లో స్పిన్నర్లు మెజారిటీ వికెట్లు సాధించారు. బంగ్లాదేశ్తో జరిగిన గత పింక్ మ్యాచ్లో మొత్తం 20 వికెట్లు పేసర్లకే దక్కాయి. ఈ నేపథ్యంలో బుమ్రా, ఇషాంత్, సిరాజ్ థర్డ్ టెస్ట్లో కీలకం కానున్నారు.