
హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్తో నాటింగ్హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీసేన పట్టు బిగించింది. మూడో రోజైన సోమవారం ఓవర్ నైట్ స్కోరు 124/2తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ జట్టు.. లంచ్ విరామ సమయానికి 60 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ (56 బ్యాటింగ్), పుజారా (54 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో భారత్ ఇంగ్లాండ్పై 362 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో భారత్కి 168 పరుగుల ఆధిక్యం లభించగా.. రెండో ఇన్నింగ్స్ స్కోరు కలుపుకుని మొత్తం 362 పరుగుల ఆధిక్యంలో ఉంది.
మూడో టెస్టులో 500కు పైగా ఆధిక్యం వచ్చే వరకూ భారత జట్టు రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయకపోవడం మంచిదని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు. తాజాగా సోమవారం లక్ష్మణ్ మాట్లాడుతూ "టెస్టులో ఇది కేవలం మూడో రోజే. కాబట్టి.. వెంటనే డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.
"జట్టులోని టాపార్డర్ బ్యాట్స్మెన్స్కి ఇది మంచి సమయం. ముఖ్యంగా.. సిరీస్ ఆరంభం నుంచి విఫలమవుతున్న పుజారాకి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అతను బాగా ఆడాడు. రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరుని కొనసాగిస్తున్నాడు. అతనికి భారీ స్కోరు చేసే అవకాశం కల్పించాలి" అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.
"అతనే కాదు.. రహానే కూడా సెంచరీ చేయాలి. అప్పుడే నాలుగో టెస్టులో వారు ఆత్మవిశ్వాసంతో ఆడగలరు. భారత్ 500కిపైగా ఆధిక్యం సాధించగలిగితే.. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్పై ఒత్తిడి పడుతుంది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా.. మిగిలిన రెండు టెస్టుల్లోనూ భారత్ స్వేచ్ఛగా ఆడగలదు" అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.