హైదరాబాద్: ఇంగ్లాండ్-ఇండియాల రెండో టెస్టు సమరానికి వేళైంది. తొలి టెస్టు వైఫల్యం అనంతరం రెండో టెస్టులో తలపడబోతున్న టీమిండియా కూర్పుపై సూచనల పరంపర ధాటిగా జరుగుతుంది. ఈ జాబితాలో హర్భజన్ సింగ్ కూడా చేరిపోయాడు. ఇంగ్లాండ్తో రెండో టెస్టులో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలని టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ సూచించాడు.
లార్డ్స్లో ఒకవేళ టాస్ ఓడి కోహ్లీసేన బౌలింగ్కు దిగితే కుల్దీప్ అవకాశాలు సృష్టించగలడని పేర్కొన్నారు. బ్యాట్స్మెన్ కుడిచేతి వాటమైనా ఎడమచేతి వాటమైనా అతడు రెండు వైపుల నుంచి టర్న్ రాబట్టగలడని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టుకు వేదికగా మారిని ఎడ్జ్బాస్టన్లో టీమిండియా యాజమాన్యం స్థానిక పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమైందని విశ్లేషించాడు.
'ఎడ్జ్బాస్టన్లో భారత్ ఒక స్పిన్నర్ను ఆడించి పొరపాటు చేసింది. అలా కాకుండా.. హార్దిక్ పాండ్య స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడిస్తే బాగుండేది. వాతావరణం వేడిగా, పిచ్ పొడిగా, సూర్యుడు బాగా ఎండ కాస్తున్నప్పుడు స్పిన్నర్ను ఆడించాలి. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ పాచిక పారలేదు' అని హర్భజన్ సింగ్ వెల్లడించాడు. తొలి టెస్టులో పేసర్లంతా కలిసి 13 వికెట్లు తీస్తే అశ్విన్ ఒక్కడే 7 వికెట్లు పడగొట్టడం గమనార్హం.
వాతావరణానికి తగ్గట్టుగా స్పిన్నర్నో పేసర్నో ఎంచుకోవాలని భజ్జీ చెప్పుకొచ్చాడు. 'కుల్దీప్ అవకాశాలు సృష్టించగలడు. గూగ్లీలు సంధిస్తాడు. ఎడమ చేతితో లెగ్స్పిన్ వేస్తాడు. టాస్ ఓడి తొలి రోజు టీమిండియా చివరి వరకు బౌలింగ్ చేస్తున్నప్పుడు మంచి పిచ్పై కుల్దీప్ వికెట్లు తీసి అవకాశాలు సృష్టిస్తాడు' అని భజ్జీ వివరించాడు.