హైదరాబాద్: ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా పట్టు బిగించింది. ఓవర్నైట్ స్కోరు 9/1తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత్ బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ప్రస్తుతం 41 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.
క్రీజులో శామ్ కరన్ (30), ఆదిల్ రషీద్ (14) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్కు 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో 3 వికెట్లు తీస్తే టీమిండియా రెండో ఇన్నింగ్స్ను మొదలుపెట్టొచ్చు. అంతకముందు లంచ్ విరామ సమయానికి 30.4 ఓవర్లలో ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది.
మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను అశ్విన్ కూల్చగా, ఆ తర్వాత ఇషాంత్ శర్మ విజృంభించాడు. మూడో రోజైన శుక్రవారం 9/1తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి లంచ్ సమయానికే 86/6తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ 13 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ప్రస్తుతం 99 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్ కొనసాగుతోంది.
మ్యాచ్ తీరు చూస్తుంటే.. భారత్ ముందు తక్కువ టార్గెట్ నిలిచే అవకాశం ఉంది. మూడో రోజు తొలి సెషన్ ఆరంభమైన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ ఓపెనర్ జెన్నింగ్స్ (8)ని ఔట్ చేసిన అశ్విన్.. ఆ తర్వాత కెప్టెన్ జో రూట్ (14)కి కూడా బోల్తా కొట్టించాడు. దీంతో 39/3తో కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ జట్టుని ఇషాంత్ శర్మ వరుసగా వికెట్లు పడగొట్టి మరింత ఒత్తిడిలోకి నెట్టేశాడు.
ఇషాంత్ ఓవర్ల వ్యవధిలో వరుసగా డేవిడ్ మలాన్ (20), జానీ బెయిర్స్టో (28), బెన్స్టోక్స్ (6)లను పెవిలియన్ బాట పట్టించాడు. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 287 పరుగులకి ఆలౌటవగా.. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 274 పరుగులకి ఆలౌటైంది. దీంతో.. ఇంగ్లాండ్కి 13 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే.