ఎదురుచూపుల ఆట ఆడాం
తొలి వన్డేకు ముందు విరాట్ కోహ్లీ ఆన్లైన్లో మీడియాతో మాట్లాడాడు. 'సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు మాకు ఒక మెయిల్ వచ్చింది. ఐపీఎల్లో గాయం కావడంతో రోహిత్ శర్మ అందుబాటులో ఉండడని అందులోని సారాంశం. గాయం వల్ల లాభనష్టాలేంటో అతడికి వివరించామని, అర్థం చేసుకున్న అతడు జట్టుకు అందుబాటులో ఉండనని చెప్పినట్టు వివరణ ఉంది. కానీ రోహిత్ మళ్లీ ఐపీఎల్ మ్యాచులు ఆడిన తర్వాత ఆస్ట్రేలియా విమానం ఎక్కుతాడనే అందరం అనుకున్నాం. కానీ రోహిత్ ఎందుకు మాతో రాలేదో సమాచారం లేదు. ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మేం ఎదురుచూపుల ఆట ఆడాం' అని కోహ్లీ తెలిపాడు.
జట్టుతో కలిసి ఆసీస్కు వెళ్లలేదు
ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో రెండో మ్యాచులో రోహిత్ శర్మ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో కొన్ని మ్యాచుల్లో ఆడలేదు. దాంతో ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ను ఎంపిక చేయలేదు. కానీ జట్టును ప్రకటించిన రోజునే హిట్మ్యాన్ ప్యాడ్లు కట్టుకొని సాధన చేసిన వీడియో బయటకు రావడంతో వివాదం చెలరేగింది. అతడి గాయం పరిస్థితి ఏంటో చెప్పాలని మాజీలు సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్ డిమాండ్ చేశారు. ఇక ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసి తాను ఫిట్గా ఉన్నట్టు ప్రకటించాడు. ఇక టెస్టు సిరీస్కు అతడిని ఎంపిక చేసినప్పటికీ జట్టుతో కలిసి ఆసీస్కు వెళ్లలేదు.
ఆఖరి రెండు టెస్టులకూ అనుమానమే
నిజానికి ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత రోహిత్ శర్మ జట్టుతో కలిసి వెళ్తాడన్న సమాచారం బయటకు వచ్చింది. టెస్టు సిరీస్ లోపు పూర్తిగా కోలుకుంటాడని భావించారు. కానీ అతడు తిరిగి ముంబైకి చేరుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఎన్సీఏలో ఇషాంత్ శర్మతో కలిసి సాధన కూడా మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత రోహిత్ గాయాన్ని పరీక్షించిన వైద్యులు ఫిట్గా లేడని నివేదిక ఇవ్వడంతో ఆసీస్తో తొలి రెండు టెస్టులకు దూరమవుతాడని బీసీసీఐ ప్రకటించింది. క్వారంటైన్ నిబంధనలను పరిశీలిస్తే ఆఖరి రెండు టెస్టులకూ అనుమానమేనని అంటున్నారు. ఇంతకు ఏం జరుగుతుందో ఏవరికి అర్ధం కావడం లేదు.