సిడ్నీ: సుదీర్ఘ పర్యటనలో భాగంగా నవంబరు 27 నుంచి ఆస్ట్రేలియాతో వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్లని భారత్ ఆడనుంది. నవంబర్ 27న సిడ్నీలో జరిగే తొలి వన్డేతో సిరీస్ ప్రారంభం కానుంది. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా సిరీస్లో కొన్ని రికార్డులు, మైలురాళ్లను భారత ఆటగాళ్లు అందుకోనున్నారు. యజువేంద్ర చహల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలను అరుదైన ఘనతలు ఊరిస్తున్నాయి. ఆ రికార్డులేంటో ఓసారి చూద్దాం.
వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ మరో 133 పరుగులు చేస్తే.. వన్డేల్లో 12000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఇప్పటివరకు 239 ఇన్నింగ్స్లో కోహ్లీ.. 11867 పరుగులు చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 12000 పరుగుల మైలురాయిని 300 ఇన్నింగ్స్లో అందుకున్నాడు. రికీ పాంటింగ్ 314, కుమార సంగ్కర 336, సనత్ జయసూర్య 379, మహేళ జయవర్దనె 399 ఇన్నింగ్స్లలో 12000 పరుగులు చేశారు. సచిన్ రికార్డును కోహ్లీ బద్ధలు కొట్టడం ఖాయమే.
అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ మరో రెండు సెంచరీలు చేస్తే.. రికీ పాంటింగ్ (71)ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలుస్తాడు. కోహ్లీ ఇప్పటికే 70 శతకాలు నమోదు చేశాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు) ఉన్నాడు. ఇక విరాట్ ఒక్క సెంచరీ చేస్తే.. ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక సెంచరీల సచిన్ రికార్డును సమం చేస్తాడు. సచిన్ 70 ఇన్నింగ్స్లో 9 సెంచరీలు చేయగా.. విరాట్ ఇప్పటి వరకు 38 ఇన్నింగ్స్లో 8 సెంచరీలు చేశాడు.
కేఎల్ రాహుల్ ఆరు వన్డే ఇన్నింగ్స్లో 261 పరుగులు చేస్తే.. వన్డేల్లో విరాట్ కోహ్లీ కన్నా వేగంగా 1500 పరుగుల మైలురాయిని అందుకున్న ప్లేయర్గా నిలుస్తాడు. ఇక యజువేంద్ర చహల్ వన్డేల్లో 100 వికెట్ల మైలురాయికి 9 వికెట్ల దూరంలో ఉన్నాడు. చహల్ 51 ఇన్నింగ్స్లో 91 వికెట్లు తీశాడు. ఈ మూడు వన్డేల సిరీస్లో 9 వికెట్లు తీసుకోగలిగితే.. 55 మ్యాచుల్లోనే 100 వికెట్ల మైలురాయిని అందుకొని అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఇండియన్ ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కుతాడు.
India vs Australia: విరాట్ కోహ్లీ లేకపోతే.. టీమిండియాకు మంచిదే: గవాస్కర్