హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో పూణె టెస్టు ఓటమికి కోహ్లీసేన ప్రతీకారం తీర్చుకుంది. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్ 1-1తో సమమైంది. బెంగుళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగాడు.
తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా ఆరు వికెట్లు తీసుకోగా రెండో ఇన్నింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు తీసుకున్నాడు. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు తీసుకోగా ఉమేశ్ యాదవ్ 2, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక మూడో టెస్టు మార్చి 16వ తేదీన రాంచీలో జరగనుంది.
బెంగుళూరు టెస్టు:
తొలి ఇన్నింగ్స్:
భారత్: 189, ఆస్ట్రేలియా 274
రెండో ఇన్నింగ్స్:
భారత్: 276, ఆస్ట్రేలియా 112 (35.4 ఓవర్లకు)
మ్యాచ్ ఫలితం: 75 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
నాలుగో రోజు టెస్టు మ్యాచ్ జరిగిందిలా:
ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
భారత్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. టీ విరామం అనంతరం క్రీజులోకి వచ్చిన మిచెల్ స్టార్క్ను అశ్విన్ అవుట్ చేశాడు. నాలుగో రోజు ఆటలో ఇంకా మూడో సెషన్ మాత్రమే మిగిలి ఉంది. ఆసీస్ టాప్ బ్యాట్స్ మెన్లను భారత బౌలర్లు పెవిలియన్కు చేర్చారు. ఇది భారత్కు ఎంతో కలిసొచ్చే అంశం. ఆసీస్ ఆటగాడు హ్యాండ్స్కోంబ్ను వీలైనంత త్వరగా భారత్ అవుట్ చేస్తే బెంగళూరు టెస్టులో టీమిండియా విజయం సాధించినట్లే. కాగా, 31 ఓవర్లకు గాను ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 85 పరుగులు అవసరం కాగా, భారత్ గెలవాలంటే 3 వికెట్లు కావాలి.
టీ విరామానికి ఆస్ట్రేలియా 101/6
భారత్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా టీ విరామ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. దీంతో బౌలర్ల సమష్టి కృషితో టీమిండియా గెలుపు బాటలో పయనిస్తోంది. 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ తడబడుతోంది. టర్నింగ్ పిచ్పై ఆసీస్ విజయానికి 87 పరుగులు అవసరం కాగా, భారత్ గెలవాలంటే 4 వికెట్లు కావాలి. భారత బౌలర్లలో అశ్విన్ 3, ఉమేష్ యాదవ్ 2, ఇషాంత్ ఒక వికెట్ తీశారు. రెండో సెషన్లో ఆసీస్ వేగంగానే పరుగులు చేసినప్పటికీ, వరుసగా వికెట్లు కోల్పోయింది.
స్మిత్ అవుట్: రెండో టెస్టుపై ఆశలు రేపిన కోహ్లీసేన
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆసీస్ కెప్టెన్ స్మిత్ను ఉమేష్ తన బౌలింగ్లో పెవిలియన్ పంపాడు. దాంతో ఆస్ట్రేలియా 21 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. హ్యండ్స్కోంబ్ 1, మిచెల్ మార్ష్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయానికి 113 పరుగులు అవసరం కాగా, భారత్ గెలవాలంటే 6 వికెట్లు కావాలి.
షాన్ మార్ష్ అవుట్: మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్
భారత్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన షాన్ మార్ష్ను ఉమేష్ యాదవ్ పెవిలియన్కు పంపాడు. 14.6వ ఓవర్లో ఉమేశ్ వేసిన బంతికి మార్ష్ ఎల్బీడబ్ల్యూగా అవుటైనట్లు అంపైర్ ప్రకటించాడు. మార్ష్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రివ్యూ కోరదామని అనుకున్నాడు. కానీ ఆసీస్కు రెండో ఇన్నింగ్స్లో మొత్తం మీద ఒకే రివ్యూ ఉండటంతో కెప్టెన్ స్మిత్తో మాట్లాడి పెవిలియన్కు చేరాడు. మరోవైపు కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 16 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 27, హ్యండ్స్కోంబ్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయానికి 120 పరుగులు అవసరం కాగా, భారత్ గెలవాలంటే 7 వికెట్లు కావాలి.
రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
భారత్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ను అశ్విన్ పెవిలియన్కు పంపాడు. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ దూకుడుగానే ఆడుతోంది. ప్రస్తుతం ఆసీస్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. మార్ష్ 1, స్మిత్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయానికి 144 పరుగులు అవసరం కాగా, భారత్ గెలవాలంటే 8 వికెట్లు కావాలి.
తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
భారత్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్ రెన్ షాను ఇషాంత్ శర్మ పెవిలియన్కు పంపాడు. రెన్ షా అవుటైన తర్వాత క్రీజులోకి కెప్టెన్ స్టీవ్ స్మిత్ వచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. వార్నర్ 8, స్మిత్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు.
ఆసీస్ విజయలక్ష్యం 188
బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాట్స్మెన్ వరుసపెట్టి పెవిలియన్కు చేరారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 274 పరుగులకే అలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు 188 పరుగుల విజయలక్ష్యం నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్లో పుజారా, రహానేలు అర్ధసెంచరీలు సాధించారు.
213/4 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించిన టీమిండియాకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు ఝలక్ ఇచ్చారు. రహానే 52, పుజారా 92, కరుణ్ నాయర్ 0, అశ్విన్లను 4 పరుగులకే పెవిలియన్కు చేర్చారు. చివర్లో సాహా (20 నాటౌట్), ఇషాంత్ 6 కాసేపు పోరాడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హెజెల్ వుడ్ 6 వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, ఓకీఫ్లు చెరో 2 వికెట్లు తీసుకున్నారు.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా కష్టాల్లో పడింది. 213/4 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. దీంతో 91 ఓవర్లకు గాను 9 వికెట్లను కోల్పయి 262 పరుగులు చేసింది. అంతకముందు హజెల్ వుడ్ బౌలింగ్లో ఉమేశ్ యాదవ్ను ఒక్క పరుగుకే పెవిలియన్కు చేర్చాడు. ప్రస్తుతం వృద్ధిమాన్ సాహా 14, ఇషాంత్ శర్మ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నాడు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 175 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అశ్విన్ అవుట్: ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్
ఆసీస్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. హెజెల్వుడ్ ఇన్నింగ్స్ 86వ ఓవర్లో రెండో బంతికి పూజారాను, ఐదో బంతికి అశ్విన్ అవుట్ చేశాడు. పుజారా 92 పరుగులు చేయగా, అశ్విన్ 4 పరుగులు చేసి అవుటయ్యారు. ప్రస్తుతం భారత్ 86 ఓవర్లకు గాను టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్లు పరుగులేమీ చేయకుండా ఉన్నారు.
పుజారా అవుట్: ఏడో వికెట్ కోల్పోయిన భారత్
ఆసీస్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 221 బంతులను ఎదుర్కొన్న పుజారా 92 పరుగుల వద్ద హెజెల్ ఉడ్బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. దీంతో పుజారా సెంచరీ చేసే అవకాశాన్ని మిస్సయ్యాడు. మూడో రోజు నిలకడగా ఆడిన పుజారా నాలుగో రోజు కూడా అదే స్ధాయిలో ఆడేందుకు ప్రయత్నించాడు.
ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన రహానే
రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో భారత్ స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 84.3వ ఓవర్లో స్టార్క్ వేసిన బంతిని ఎదుర్కొన్న రహానే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలుత అంపైర్ నాటౌట్గా ప్రకటించడంతో ఆసీస్ ఆటగాళ్లు రివ్యూ కోరారు. రివ్యూలో బంతి వికెట్లను తాకినట్లు తేలడంతో అవుట్గా ప్రకటించారు. దీంతో పుజారా, రహానేల 118పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రహానె(52) ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ పరుగులేమీ చేయకుండా స్టార్క్ వేసిన బంతికి బౌల్డ్ అయ్యాడు.

రహానే అర్ధసెంచరీ
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో రహానే అర్ధ సెంచరీ చేశాడు. నాలుగో రోజు ఆటలో తొలి సెషన్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలన్న దిశగా భారత ఆటగాళ్లు కాస్త దూకుడు పెంచారు. 128 బంతులను ఎదుర్కొన్న రహానే నాలుగు బౌండరీలతో అర్ధ సెంచరీని పూర్తిచేశాడు. 81వ ఓవర్లో స్టార్క్ వేసిన రెండో బంతిని బౌండరీకి తరలించి 50 పరుగులు పూర్తి చేశాడు. టెస్టుల్లో రహానేకి ఇది 11వ అర్ధ సెంచరీ. ప్రస్తుతం భారత్ 82 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. పుజారా 87, రహానే 51 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 145 పరుగుల ఆధిక్యంలో ఉంది.
రివ్యూలో నాటౌట్గా నిలిచిన పుజారా
76వ ఓవర్లో ఆసీస్ స్పిన్నర్ లియాన్ వేసిన బంతిని పుజారా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. దీంతో లియాన్ ఎల్బీడబ్ల్యూగా అప్పీల్ చేయడంతో అంపైర్ అవుట్గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా భారత్ ఆటగాళ్లు ఆశ్యర్యానికి గురయ్యారు. వెంటనే పుజారా రివ్యూ కోరాడు. రివ్యూలో పుజారా నాటౌట్గా తేలింది. దీంతో ఒక్కసారిగా అభిమానులు, భారత ఆటగాళ్లు వూపిరి పీల్చుకున్నారు. 77 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా 83, రహానె 44పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఆసీస్పై 134 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
నాలుగో రోజు ప్రారంభమైన ఆట
బెంగుళూరు వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. 213/4 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ఆరంభించిన టీమిండియా భారీ స్కోరు సాధించే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ రోజు ఆటలో తొలి సెషన్ కీలకం కానుంది. మొదటి సెషన్లో వికెట్ పడకుండా ఆడితే టీమిండియాకు మ్యాచ్పై పట్టదొరకడం ఖాయం. ఐదో వికెట్కి పుజారా, రహానెల భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. ఈ సిరీస్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.