భళా యువ భారత్.. మీ క్రీడా స్పూర్తికి సలామ్

క్రికెట్లో తమకన్నా చిన్నదేశమనే చులకనలేదు.! తమ చేతిలో చిత్తుగా ఓడిందనే అహంకారం అస్సలు లేదు.! కుర్రాళ్లైనా పెద్దలకు మించిన పరిపక్వతను ప్రదర్శించారు.! గెలుపు తమదైనా ఆ ఆనందాన్ని ప్రత్యర్థికి పంచారు.! అద్భుతమైన ఆటతో పాటు క్రీడా స్పూర్తిని చాటారు.! దాంతో యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసలు అందుకుంటున్నారు.. టీమిండియా అండర్-19 కుర్రాళ్లు!
అండర్-19 ప్రపంచకప్ వేదికగా తొలి సారి బరిలోకి దిగిన జపాన్ను ప్రియమ్ గార్గ్ నేతృత్వంలోని యువ భారత్ చిత్తుగా ఓడించడం ఒక ఎత్తైతే.. మ్యాచ్ అనంతరం వారు కనబర్చిన క్రీడాస్పూర్తి మరో ఎత్తు. ఇప్పుడు ఇదే వీరిని ప్రత్యేకంగా నిలబెట్టింది. యావత్ క్రికెట్ ప్రపంచం ముందు హీరోలను చేసింది. వారు కనబర్చిన క్రీడాస్పూర్తికి సోషల్ మీడియా సలాం చెప్తుంది.
బ్యూటీ ఆఫ్ ది గేమ్..
ఐదుగురు డకౌట్లు.. ఏ ఒక్కరు డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. 22.3 ఓవర్లలో 41 రన్స్కు ప్యాకప్. అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు. ఎక్స్ట్రాల రూపంలో వచ్చిన 19 పరుగులే జపాన్ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరు. అనంతరం భారత్ 29 బంతుల్లోనే విజయాన్నందుకుంది. కానీ ఇవేవి క్రికెట్ అభిమానులను ఆకర్షించలేదు. మ్యాచ్ అనంతరం ఇరుజట్లు కలిసి దిగిన ఫొటోనే అందరిని ఆకట్టుకుంది. విజయానందాన్ని ప్రత్యర్థికి పంచిన భారత ఆటగాళ్ల క్రీడాస్పూర్తినే ప్రతీ ఒక్కరికి నచ్చింది. ఇంకేముంది సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిసింది. భళా భారత్... మీ క్రీడాస్పూర్తికి సలామ్.. అని ఒకరంటే.. బ్యాటీ ఆఫ్ ది గేమ్ అని మరొకరు.. బెస్ట్ మూమెంట్ ఆఫ్ ది టోర్నీ అని ఇంకొకరు కామెంట్ చేశారు.
ఆరోజును గుర్తు చేశారు..
అఫ్గానిస్థాన్తో జరిగిన ఏకైక చారిత్రాత్మక టెస్ట్ విజయానంతరం కూడా కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇదే క్రీడాస్పూర్తిని చాటింది. అప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం భారత జట్టుపై ప్రశంసల జల్లు కురిపించింది. ఇప్పుడు యువభారత్ అదే చేయడంతో కొందరు నాటి రోజును గుర్తు చేసుకుంటున్నారు. అఫ్గాన్తో జట్టుతో కలిసి సీనియర్ క్రికెటర్లు చాటిన క్రీడాస్పూర్తిని నాటి రోజులను గుర్తుచేశారని ట్వీట్ చేస్తున్నారు.
ఇరుజట్ల బర్త్డే బాయ్స్ సెల్ఫీ..
మ్యాచ్ జరిగిన మంగళవారం భారత్ ప్లేయర్ ధృవ్ జురెల్.. జపాన్ ఆటగాడు కెంటో ఒట డొబెల్ పుట్టినరోజు. ఈ మ్యాచ్ అనంతరం ఈ ఇద్దరు ఆటగాళ్లు కలిసి బర్త్డే సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఒకే కేకును ఇరు జట్ల సమక్షంలో కట్ చేశారు. తమ సహచర ఆగాళ్లతో ఆడుతూ పాడుతూ ఘనంగా జరుపుకున్నారు. ఇద్దరు కలిసి సెల్ఫీ దిగారు. ఈ ఫోటోను, సెలెబ్రేషన్స్ వీడియోను ఐసీసీ.. క్రికెట్ వరల్డ్ కప్ ట్విటర్లో షేర్ చేసింది.
రవి బిష్ణోయ్ 5 పరుగులు ఇచ్చి 4 వికెట్లు
భారత లెగ్స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' రవి బిష్ణోయ్ 5 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తన తొలి రెండు బంతుల్లోనే అతను రెండు వికెట్లు తీశాడు. కార్తీక్ త్యాగికి 3, ఆకాశ్ సింగ్కు 2 వికెట్లు దక్కాయి. వీరి ధాటికి జపాన్ 41 రన్స్కే కుప్పకూలింది. అనంతరం ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (18 బంతుల్లో 29 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కుమార్ కుశాగ్ర (11 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి 29 బంతుల్లో ఆట ముగించారు. వరుసగా రెండో విజయం సాధించిన భారత్ నాలుగు పాయింట్లతో క్వార్టర్ ఫైనల్ చేరింది. శుక్రవారం జరిగే తమ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్తో ఆడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications