ముంబై: భారత క్రికెట్ జట్టు.. త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. మూడు చొప్పున వన్డే ఇంటర్నేషనల్స్, టీ20, టెస్ట్ మ్యాచ్లను ఆడాల్సి ఉంది. బలమైన దక్షిణాఫ్రికా జట్టును ఆ దేశ గడ్డపై ఓడించాలంటే జట్టు నిండా ఆల్రౌండర్లు అవసరం అవుతుంది. దీనికోసం జట్టును ఎంపిక చేసే ప్రయత్నాల్లో ఉంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ కమిటీ. జట్టు కూర్పు కుదరకపోవడంతో ఎంపికను ఒకరోజు వాయిదా సైతం వేసుకుంది.
ఈ పరిస్థితుల్లో భారత జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. అన్ని ఫార్మట్లలోనూ రాణించగల సత్తా ఉన్న టీమిండియా ఏకైక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరం అయ్యాడు. గాయం వల్ల వైదొలిగాడు. దక్షిణాఫ్రికాకు బయలుదేరే జట్టులో అతని చోటు దక్కట్లేదు. అతని పేరును పరిశీలనలోకి తీసుకోలేదు సెలెక్షన్ కమిటీ. ఎముక స్వల్పంగా చిట్లింది. అతనికి త్వరలోనే సర్జరీ చేసే అవకాశం ఉంది. ఫలితంగా దక్షిణాఫ్రికా పర్యటన మొదలుకాకముందే ఓ ఆల్ రౌండర్ తప్పుకొన్నట్టయింది.
దక్షిణాఫ్రికా పర్యటనకు రవీంద్ర జడేజా ఎంపిక కాకపోవచ్చంటూ ఇదివరకే వార్తలు వచ్చాయి. దీన్ని నిజం చేస్తూ- బీసీసీఐ అతను జట్టుకు దూరమైన విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. గాయం వల్ల న్యూజిలాండ్తో ముంబైలోని వాంఖెడె స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో రవీంద్ర జడేజా ఆడలేదు. కాగా- మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా ఈ పర్యటన కోసం ఎంపిక అయ్యేది అనుమానమే. వారిద్దరూ కూడా గాయాలతో సతమతమౌతున్నారు.
దక్షిణాఫ్రికా జట్టును ఆ దేశ గడ్డపై ఎప్పుడూ ఓడించలేదు భారత జట్టు. అందుకే- ఈ సారి ఆ కొరతను తీర్చుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఈ పరిస్థితుల్లో జట్టు కీలక ఆటగాళ్లు, ఆల్రౌండర్లు గాయాల బారిన పడటం సెలెక్షన్ కమిటీకి షాక్కు గురి చేస్తోంది. వారి స్థానాన్ని అంతే సమర్థులైన వారితో రీప్లేస్ చేయడానికి సమాయాత్తమౌతోంది. జట్టు కూర్పు మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు లేకపోలేదు. సీనియర్లు గాయాలబారిన పడటం వల్ల యంగ్స్టర్స్కు అవకాశం లభించవచ్చు.