

హైదరాబాద్: నిదహాస్ టోర్నీలో భారత్ రెండో సారి టైటిల్ గెలుచుకుంది. ఉత్కంఠభరితంగా ఆఖరి బాల్ వరకూ సస్పెన్స్తో నడిచిన మ్యాచ్కు దినేశ్ కార్తీక్ చరమగీతం పాడాడు.
1998లో జరిగిన టోర్నీలో శ్రీలంకపై ఆరు పరుగులతో గెలుపొంది తొలిసారి సిరీస్ సొంతం చేసుకోగా, ఆదివారం రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై 4వికెట్ల తేడాతో గెలుపొంది రెండోసారి కప్ను కైవసం చేసుకుంది.
తీవ్రమైన సస్పెన్స్తో సాగిన ఈ మ్యాచ్లో దినేశ్ కార్తీక్ 8 బంతులలోనే 29పరుగులు చేసి ఔరా అనిపించాడు. విన్నింగ్ షాట్ సిక్సుతో కలిపి 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి భారత్ను విజేతగా నిలిపాడు. దినేశ్ కార్తీక్ అద్భుత ఆటతీరుతో భారత్ను గెలిపిండంతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
అయితే భారత్ అభిమానులతో పాటు శ్రీలంక అభిమానులు సైతం సంబరాలు చేసుకున్నారు. భారత్ విజయాన్ని తమ విజయంగా భావించి వేడుకలు జరుపుకున్నారు. ఇందుకు కారణం బంగ్లాదేశ్, శ్రీలంకల మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్. ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్లో శ్రీలంక అనూహ్యంగా ఓటమిపాలైంది. అంతేకాకుండా బంగ్లా ఆటగాళ్లు శ్రుతిమించి శ్రీలంక ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.
దీంతో భారత్ , బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో లంక అభిమానులు ఇండియాకు మద్దతు పలికారు. భారత్ గెలవాలని కోరుకున్నారు. ఉత్కంఠ పోరులో భారత్ గెలవడంతో లంక అభిమానులు పండగ చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఓ శ్రీలంక అభిమాని, భారత అభిమానిని ఎత్తుకొని గ్రౌండ్లో పరుగులు తీశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది.