India Playing XI vs ENG: రోహిత్ రీఎంట్రీ.. బుమ్రా సేనకు రెస్ట్! తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

హైదరాబాద్: ఇంగ్లండ్ గడ్డపై పరాజయాల పరంపరకు తెరదించి, టెస్టు సిరీస్ గెలిచేందుకు వచ్చిన సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్న టీమిండియా.. టీ20 సిరీస్కు సిద్దమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా గురువారం జరగనున్న తొలి టీ20లో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్కు రీషెడ్యూల్ టెస్ట్ ఆడిన సీనియర్ టీమ్ దూరంగా ఉండగా.. ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల సిరీస్ గెలిచిన ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగనుంది.
కరోనా కారణంగా చివరి నిమిషంలో టెస్ట్ మ్యాచ్కు దూరమైన రోహిత్ శర్మ.. తొలి టీ20తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. సెకండ్ స్ట్రింగ్ టీమ్ను నడిపించనున్నాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఈ మ్యాచ్కు దూరంగా ఉండగా.. ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ జట్టును పర్యవేక్షించనున్నాడు. టీ20 ప్రపంచకప్కు ఈ సిరీస్ను ఇరు జట్లు సన్నాహకంగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే తొలి టీ20 బరిలోకి దిగే భారత తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఓపెనర్లుగా రోహిత్, ఇషాన్ కిషన్..
టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే కరోనా నుంచి పూర్తిగా కోలుకోని వైట్బాల్ సిరీస్ కోసం సన్నాహకాలు కూడా ప్రారంభించాడు. ఐపీఎల్ పేలవ ప్రదర్శన అనంతరం పరుగుల ఆకలి మీదున్న రోహిత్.. ఈ సిరీస్లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. గాయం కారణంగా కేఎల్ రాహుల్ ఈ పర్యటనకు దూరమవడంతో ఇషాన్ కిషన్తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేయనున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 4 ఇన్నింగ్స్లో 192 పరుగులు చేశాడు. ఐర్లాండ్తోనూ పర్వాలేదనిపించాడు.

మిడిలార్డర్లో సంజూ, సూర్య, హుడా..
ఇక మిడిలార్డర్లో సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా బరిలోకి దిగనున్నారు. ఐర్లాండ్తో 72 పరుగులతో సత్తా చాటిన సంజూ సూపర్ ఫామ్లో ఉన్నాడు. తనదైన బ్యాటింగ్తో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సూర్యకుమార్ యాదవ్.. ఇంగ్లండ్ గడ్డపై సత్తా చాటాలనే కసితో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలంటే ఈ సిరీస్లో రాణించడం అతనికి చాలా ముఖ్యం. అనూహ్యంగా భారత జట్టులోకి వచ్చిన దీపక్ హుడా.. తనకు వచ్చిన అవకాశాలను రెండు చేతులతో అందిపుచ్చుకుంటున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్లో సత్తా చాటిన అతను.. అంతర్జాతీయ క్రికెట్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఐర్లాండ్తో 57 బంతుల్లో 104 పరుగులతో సత్తా చాటాడు.

హిట్టర్లుగా హార్దిక్, కార్తీక్..
ఐపీఎల్ 2022 సీజన్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో పాటు కెప్టెన్గా ట్రిపుల్ ధమాకా అందించిన హార్దిక్.. టీమిండియాలోకి ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ కెప్టెన్గా సత్తా చాటి భవిష్యత్తు కెప్టెన్సీ రేసులో నిలిచాడు. ఇంగ్లండ్తో తొలి టీ20లో కూడా హార్దిక్ కెప్టెన్సీ చేయాల్సింది. కానీ రోహిత్ రీఎంట్రీతో ఆ అవకాశం చేజారింది. ఇక ఐపీఎల్ 2022 సీజన్తో నయా హిట్టర్గా అవతారమెత్తిన దినేశ్ కార్తీక్.. అంతర్జాతీయ క్రికెట్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో పాటు ఐర్లాండ్తోనూ అతను సత్తా చాటాడు. ఆ ప్రదర్శనతోనే ఇప్పుడు ఇంగ్లండ్తో సిరీస్కు ఎంపికయ్యాడు. ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో తుది జట్టులో అతనికి చోటు ఖాయం

భువీ నేతృత్వంలో..
భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలో ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. సౌతాఫ్రికాతో పాటు ఐర్లాండ్ సిరీస్ల్లో ఈ నలుగురు సత్తా చాటారు. ముఖ్యంగా హర్షల్ పటేల్ బ్యాట్తోను మెరుస్తున్నాడు. ఇటీవల జరిగిన సన్నాహక మ్యాచ్లో హర్షల్ హాఫ్ సెంచరీతో మెరిసాడు. ఫాస్ట్ పిచ్ల నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్కు అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం ఆవేశ్ ఖాన్ బెంచ్కు పరిమితమవుతాడు.

తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్/ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications