హైదరాబాద్: రెండో టెస్టులో గాయపడిన విరాట్ కోహ్లీ పూర్తిగా కోలుకున్నా కోలుకోకపోయినా మూడో టెస్టులో తప్పకుండా ఆడాలని అంటున్నారు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. 'కీలకమైన మూడో టెస్టులో కోహ్లీ ఆడాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే అతడు జట్టు కెప్టెన్' అని ఆయన అన్నారు. లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ వెన్నునొప్పితో బాధపడ్డాడు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసే సమయంలో ఫీల్డింగ్కు రాని కోహ్లీ ఆ తర్వాత నాలుగో స్థానంలోనూ బ్యాటింగ్కు రాని సంగతి తెలిసిందే.
తాజాగా సునీల్ గవాస్కర్ మీడియాతో మాట్లాడుతూ... 'మూడో టెస్టుకు ఐదు రోజుల సమయం ఉంది కాబట్టి పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తా అని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒక వేళ కోహ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించకపోయినా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగే మూడో టెస్టులో అతడు తప్పకుండా ఆడాలి. ఎందుకంటే జట్టులో అతడు కీలకమైన సభ్యుడు. కెప్టెన్ కూడా. 50శాతం ఫిట్నెస్తో ఉన్నా ఆడాలి.'
'తదుపరి టెస్టు కోసం టీమిండియా ప్రత్యేక వ్యూహాలను రచించుకుని నాటింగ్హామ్ చేరుకోవాలి. మంగళవారం నుంచి ట్రెంట్బ్రిడ్జ్లో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్లో పాల్గొంటారని అనుకుంటున్నా. వరుసగా మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ను ఓడించడం కష్టమే. కానీ, మీరు మీ స్థాయి ప్రదర్శన చేస్తే ఇంగ్లాండ్ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు' అని గవాస్కర్ అన్నారు.
వెన్ను నొప్పి కారణంగా కోహ్లి ఉదయం ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా మైదానంలోకి రాలేదు. అతడి స్థానంలో వైస్కెప్టెన్ అజింక్య రహానె జట్టుకు నాయకత్వం వహించగా.. రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేశాడు. మ్యాచ్ అనంతరం కోహ్లి తన గాయం గురించి మాట్లాడుతూ.. ''వెన్ను నొప్పి నిజమే. కానీ ఐదు రోజుల్లో పూర్తిగా కోలుకుంటానన్న నమ్మకం నాకుంది'' అని అన్నాడు.
ఫీల్డింగ్కు దిగకపోవడం కోహ్లి రెండో ఇన్నింగ్స్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రాలేకపోయాడు. 37 నిమిషాల పాటు మైదానానికి దూరంగా ఉన్న అతడు.. నిబంధనల ప్రకారం భారత్ ఇన్నింగ్స్లో అంత సమయం గడిస్తే తప్ప బ్యాటింగ్కు రాలేడు. ఆ 37 నిమిషాల్లోపే భారత్ మురళీ విజయ్, కేఎల్ రాహుల్ల వికెట్లు చేజార్చుకుంది. రాహానె నాలుగో స్థానంలో రావాల్సివచ్చింది. బ్యాటింగ్ చేస్తూ అశ్విన్, హార్దిక్ పాండ్య కూడా గాయపడ్డారు.