'రూట్ ఉదార స్వభావానికి టీమిండియా థాంక్స్ చెప్పాలి'

హైదరాబాద్: ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్కు కోహ్లీసేన థాంక్స్ చెప్పాలని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. నాటింగ్హామ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. మూడో టెస్టులో కోహ్లీ, రహానే, పుజారాలు రాణించడంతో టీమిండియా ఇంగ్లాండ్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ క్రమంలో గవాస్కర్ మాట్లాడుతూ "మూడో టెస్టులో టాస్ గెలవగానే భారత జట్టుని బ్యాటింగ్కు పిలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ ఉదార స్వభావానికి ధన్యవాదాలు చెప్పాలి. రెండో టెస్టులో మాదిరిగా స్వింగ్ బంతులకు కోహ్లీసేన ఇబ్బందిపడి కుప్పకూలుతుందనే ఉద్దేశంతోనే అతనలా చేసి ఉండొచ్చు" అని అన్నాడు.
అయితే విరాట్ కోహ్లీ, రహానే, పుజారా రాణించడంతో వారి ఆశలు అడియాసలు అయ్యాయని గవాస్కర్ తెలిపాడు. మూడో టెస్టులో అండర్సన్, బ్రాడ్, స్టోక్స్ను భారత ఆటగాళ్లు సమర్థంగా ఎదుర్కొని భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. కాగా, తొలి ఇన్నింగ్స్లో కోహ్లీసేన 329 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ను 161 పరుగులకు ఆలౌట్ చేసింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించి 352/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్కు 521 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లాండ్ నాలుగో రోజైన మంగళవారం లంచ్ విరామ సమయానికి 35 ఓవర్లు ముగిసే సరికి 62 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది.
భారత పేసర్లు ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చి ప్రత్యర్థిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. 23 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి తొలి వికెట్ను కోల్పోయింది. ఇషాంత్ శర్మ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి జెన్నింగ్స్(13) ఔటయ్యాడు.
ఆ తర్వాత ఇషాంత్ శర్మనే ఇన్నింగ్స్ 12వ ఓవర్ చివరి బంతికి మరో ఓపెనర్ అలెస్టర్ కుక్ (17)ను పెవిలియన్కు చేర్చాడు. స్లిప్లో ఉన్న కేఎల్ రాహుల్ ఈ క్యాచ్ని అందుకున్నాడు. కుక్ను ఇషాంత్ శర్మ ఔట్ చేయడం ఇది 11వ సారి. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జోరూట్, పోప్తో కలిసి స్కోరు బోర్డుని పెంచే ప్రయత్నం చేశాడు.
అయితే బుమ్రా వేసిన 25వ ఓవర్ మూడో బంతికి రూట్(13) రాహుల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే ఒలివ్ పోప్ (16)ను షమి ఔట్ చేశాడు. స్లిప్లో కేఎల్ రాహుల్ దగ్గరకు వచ్చిన బంతిని పక్కనే ఉన్న కోహ్లీ ఎగిరి మరీ అందుకోవడం విశేషం. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే ఇంగ్లండ్ ఇంకా 437 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్కు మరో ఆరు వికెట్లు కావాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications