|
సౌతాఫ్రికా సిరీస్తో మొదలు..
ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్, వన్డే సిరీస్ల్లో ఓడటంతో మొదలైన భారత క్రికెట్ జట్టు ఓటముల పరంపర.. బంగ్లాదేశ్తో తొలి వన్డేలో ఓటమి వరకూ కొనసాగింది. అలాగనీ టీమిండియా సిరీస్లు గెలవలేదా అంటే..? గెలిచింది. కానీ టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్పై విరాట్ కోహ్లీ వీరోచిత పోరాటంతో గెలవడం మినహా అభిమానులకు సంతృప్తినిచ్చే విజయాలేవీ లేవు అని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు.
ఈ ఏడాది ఆరంభంలోనే విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై వేటు వేసిన బీసీసీఐ.. రోహిత్ శర్మను మూడు ఫార్మాట్ల కెప్టెన్గా ఎంపిక చేసింది. అతను ఫిట్నెస్ సమస్యలతో తొలి సిరీస్కే దూరమయ్యాడు.
|
ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లు..
దాంతో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాతో ఆడిన భారత్ దారుణంగా విఫలమైంది. ఇంగ్లండ్తో చివరి టెస్టు కోవిడ్ కారణంగా వాయిదా పడటంతో.. ఈ ఏడాది నిర్వహించగా.. అప్పటి వరకూ సిరీస్లో ఆధిక్యంలో ఉన్న భారత్.. చివరి టెస్టులో ఓడి సిరీస్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. టీ20 ప్రపంచకప్ ముందు జరిగిన ఆసియాకప్లోనూ కనీసం ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.
గాయంతో సుదీర్ఘ కాలం జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ను ఈ టోర్నీలో నేరుగా ఆడించడం టీమిండియా విజయాలపై ప్రభావం చూపింది. రోహిత్ శర్మ ఫిట్ నెస్ సమస్యలు.. ఆటగాళ్ల రొటేషన్ పేరుతో ఈ ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లతో బరిలోకి దిగింది. దాంతో అసలు సిసలు కోర్ టీమ్ లేకపోవడం టీమిండియాను ఘోరంగా దెబ్బతీసింది.
చాహల్కు రెస్ట్ ఎందుకు..?
టీ20 వరల్డ్ కప్ కోసం దినేశ్ కార్తీక్ను ఏడాదికిపైగా ఫినిషర్గా తీర్చిదిద్ది అతణ్ని సరిగా వాడుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమైంది. జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ విషయంలోనూ తొందరపడ్డ మేనేజ్మెంట్ చివరకు మూల్యం చెల్లించుకుంది. ఆటగాళ్లకు విచ్చలవిడిగా స్వేచ్చనిచ్చి.. వాటర్ గేమ్స్ పేరిట కీలకమైన రవీంద్ర జడేజాను దూరం చేసుకుంది. యుజ్వేంద్ర చాహల్కు ప్రపంచకప్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. కానీ ఏడాది కాలంగా అసలు టీ20లే ఆడని షమీ, అశ్విన్లను వరుసగా ఆడించి మూల్యం చెల్లించుకుంది. అసలు ఏం ఆడాడని చాహల్కు బంగ్లాదేశ్ పర్యటనకు విశ్రాంతి ఇచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదు. స్పిన్కు అనుకూలించే బంగ్లాదేశ్లో అతను కీలకమయ్యేవాడు.
సంజూ శాంసన్ ఎందుకు వద్దు..?
ఇక పదే పదే విఫలమవుతున్న రిషభ్ పంత్కు టీమ్మేనేజ్మెంట్ ఎందుకు అండగా ఉంటుందో ఇప్పటి వరకు అర్థం కానీ పరిస్థితి. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు కప్ అందించిన హార్దిక్ పాండ్యాకు.. ప్రయోగాత్మకంగా టీ20ల్లో కెప్టెన్సీ అవకాశం ఇస్తే.. అతడు నిరూపించుకున్నాడు. దీంతో పాండ్యాను పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్గా నియమించాలని బీసీసీఐ అనుకుంటోంది.
మరి అదే ఐపీఎల్లో జట్టును రన్నరప్గా నిలిపిన సంజూ శాంసన్కు మాత్రం ఆడే అవకాశం ఇవ్వడం లేదు. పంత్కు కనీసం రిప్లేస్మెంట్గా అయినా అతన్ని ఎంపిక చేయలేదు. బ్యాకప్ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ ఉండగా.. రాహుల్తో కీపింగ్ చేయించాల్సిన అవసరం ఏం ఉంది? అనేది అర్థం కాని ప్రశ్న. రాహుల్ ద్రవిడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.