అహ్మదాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతకు అడుగు దూరంలో నిలిచాడు. వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు(బుధవారం) జరిగే రెండో వన్డేతో మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి స్వదేశంలో 100వది. వన్డే కెరీర్లో ఇప్పటివరకు 258 మ్యాచ్లు ఆడిన కింగ్ కోహ్లీ.. స్వదేశంలో 99 మ్యాచ్లు ఆడాడు. నేడు జరిగే మ్యాచ్తో 100 వన్డేల మైలురాయి అందుకోనున్నాడు.
తద్వారా ఈ ఘనతను అందుకున్న భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్(164), ఎంఎస్ ధోని(127), అజహారుద్దీన్(113), యువరాజ్ సింగ్(108)ల సరసన చేరనున్నాడు. క్రికెట్ చరిత్రలో ఇలా స్వదేశాల్లో 100 వన్డేలు ఆడిన ఆటగాళ్లు కోహ్లీ కంటే ముందు 35 మంది మాత్రమే ఉన్నారు. ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ కొట్టినా.. కొట్టకపోయినా.. మ్యాచ్ల లెక్కన అతని ఖాతాలో మరో సెంచరీ చేరడం ఖాయమైంది. ఇక కోహ్లీ స్వదేశంలో ఆడిన 99 మ్యాచ్ల్లో 60 సగటుతో 5002 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక ఫస్ట్ వన్డేలో సూపర్ హిట్ అయిన టీమిండియా.. వెస్టిండీస్తో రెండో వన్డేకు రెడీ అయ్యింది. బుధవారం జరిగే ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం భారత్ 1-0తో లీడ్లో ఉంది. తొలి వన్డేలో భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. అటు బౌలింగ్లో ప్రత్యర్థిని కట్టడి చేసిన తర్వాత బ్యాటింగ్ జోరుతో 28 ఓవర్లలోనే ఆట ముగించింది. సాధారణంగానైతే తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్కు దూరమైన రెగ్యులర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుతో చేరాడు.
అతను మిడిలార్డర్లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే దీపక్ హుడాను పక్కన పెట్టాల్సి ఉంటుంది. మిడిలార్డర్లో కోహ్లి, పంత్, సూర్యకుమార్ల స్థానాల్లో మార్పు సాధ్యం కాదు కాబట్టి హుడాపైనే వేటు పడనుంది. మరోవైపు ఓపెనర్గా ఇషాన్ కిషన్ ఫర్వాలేదనిపించాడు. బౌలింగ్ లో కూడా భారత్ అంచనాలకు అనుగుణంగా రాణించింది. ఇద్దరు స్పిన్నర్లు చహల్, సుందర్ కలిసి ఏడు వికెట్లు తీశారు. కాబట్టి స్పిన్ విభాగంలో మార్పుకు అవకాశం తక్కువ. ఇద్దరు పేసర్లు సిరాజ్, ప్రసిధ్ కూడా ఆకట్టుకున్నారు. వైవిధ్యం కోసం చైనామన్ బౌలర్ కుల్దీప్కు అవకాశం ఇవ్వాలని భావిస్తే శార్దుల్ను పక్కన పెట్టవచ్చు. స్పల్ప మార్పులు చేసినా సరే భారత జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది.