రాజ్కోట్: శ్రీలంకతో మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. గత మ్యాచ్ ఫలితం గురించి ఆలోచించడం లేదని చెప్పిన హార్దిక్ పాండ్యా.. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. గత మ్యాచ్ వికెట్ మాదిరే ఈ పిచ్ కూడా ఉండనుందని, రాత్రి వేళలో చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, బంతి స్వింగ్ అవుతుందని భావిస్తున్నామని తెలిపాడు.
'ఇది మంచి బ్యాటింగ్ ట్రాక్లా కనబడుతోంది. వాతావరణం చల్లగా ఉన్న నేపథ్యంలో స్వింగ్ లభిస్తుందని ఆశిస్తున్నా. మేం తప్పిదం చేశాం. అయినా మా సాయశక్తులా పోరాడం. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్తో బరిలోకి దిగుతున్నాం'అని హార్దిక్ తెలిపాడు. ఆటగాళ్లకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే జట్టులో మార్పులు చేయలేదని హార్దిక్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ కుమార్ వంటి బెంచ్ ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం దక్కలేదు.
ఇక టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక తెలిపాడు. తమ అప్రోచ్ మార్చుకున్నామని చెప్పిన షనక.. సానుకూలంశాల గురించి చర్చించుకున్నామని చెప్పాడు. ఒక్క మార్పు చేశామని చెప్పిన షనక.. భానుక రాజపక్స స్థానంలో అవిష్క ఫెర్నాండో జట్టులోకి వచ్చాడని చెప్పాడు.
మూడు టీ20ల సిరీస్లో చెరొక మ్యాచ్ గెలవడంతో ఈ మ్యాచ్ డిసైడర్గా మారింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టును సిరీస్ వరించనుంది. దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
తుది జట్లు:
భారత్: ఇషాన్ కిషన్(కీపర్), శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్
శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్(కీపర్), అవిష్కా ఫెర్నాండో, ధనంజ డిసిల్వా, చరిత్ అసలంక, డసన్ షనక(కెప్టెన్), వానిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మధుషంక