హార్దిక్ పాండ్యా అత్యుత్సాం..
కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడనే వాదన వినిపిస్తోంది. జట్టులో తనకు సంబంధించిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం, కీలక సమయంలో అనవసర నిర్ణయాలు తీసుకోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. తొలి టీ20లో ఆఖరి ఓవర్ అక్షర్ పటేల్కు ఇచ్చి ప్రయోగం చేశానని చెప్పిన హార్దిక్.. రెండో టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం అందర్నీ షాక్కు గురిచేసింది. అంతేకాకుండా పుణే రికార్డ్స్ తనకు తెలియవంటూ ఎటకారంగా మాట్లాడటం మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఈ వికెట్పై ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లనే విజయం వరించింది. అయినా హార్దిక్ ఫీల్డింగ్ ఎంచుకొని మూల్యం చెల్లించుకున్నాడు.
బౌలింగ్ చేయకుండా..
అంతేకాకుండా బౌలింగ్ వనరుల వినియోగంలో ప్రణాళికా లోపం కనిపించింది. తొలి ఓవర్ వేసిన పాండ్యా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక గాయం నుంచి కోలుకొని వచ్చిన అర్ష్దీప్ తొలి ఓవర్లో 19 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో అతనికి 19వ ఓవర్ వరకు మరో ఓవర్ ఇవ్వలేదు. సాధారణంగా టీ20ల్లో 19, 20వ ఓవర్లు బ్యాటర్లు స్వేచ్ఛగా షాట్లు ఆడతారు. అలాంటి సమయంలో అర్ష్దీప్ చేతికి బంతి ఇచ్చాడు.. అప్పటికే భీకర షాట్లతో రెచ్చిపోయిన షనక అర్ష్దీప్ బౌలింగ్ను ఊచకోత కోశాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో రెండు ఓవర్లకు 6.50 ఎకానమీతో 13 పరుగులే ఇచ్చిన కెప్టెన్ పాండ్యా బౌలింగ్ చేయడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. తొలి మ్యాచ్లో కూడా వివిధ కారణాలతో చివరి ఓవర్ వేయడానికి పాండ్యా ఇష్టపడలేదు. రెండో మ్యాచ్లో అలాంటి కారణాలు ఏమీ లేకపోయినా కీలక సమయంలో బంతిని తీసుకోలేదు.
ఓపెనింగ్ జోడీ వైఫల్యం..
ఓపెనర్ల వైఫల్యం కూడా టీమిండియాను దెబ్బతీసింది. పవర్ ప్లే ముగిసే సరికే 39 పరుగులకు టాప్ ఆర్డర్ పెవిలియన్కు చేరుకొంది. ఈ మ్యాచ్లో టీమిండియా తరఫున తొలి ఆరుగురు బ్యాటర్లలో ఒక్క సూర్యకుమార్ను పక్కన పెడితే మిగిలిన ఐదుగురు కలిసి చేసిన స్కోరు 33 పరుగులు..! రోహిత్, కోహ్లీలను పక్కన పెట్టి ఇచ్చిన అవకాశాలను కొత్త బ్యాటర్లు నేలపాలు చేసుకొన్నారు. భారత్ విజయం సాధించిన తొలి మ్యాచ్లో కూడా పవర్ ప్లే ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. కొత్తగా అవకాశం దక్కించుకొన్న ఆటగాళ్లు శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠిలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు.
కొంపముంచిన నోబాల్స్..
శ్రీలంక బ్యాటింగ్లో 20వ ఓవర్ ప్రారంభ సమయానికి 186/6 స్కోర్తో ఉంది. టీమిండియా కూడా బ్యాటింగ్ సమయంలో 20వ ఓవర్ మొదలయ్యే సరికి 186/6 స్కోర్ వద్దే ఉంది. ఈ మ్యాచ్లో భారత్, శ్రీలంక మధ్య ఒక్కటే తేడా. అవి నోబాల్స్..! శ్రీలంక 10 వైడ్ బాల్స్ వేసింది.. కానీ, ఒక్క నోబాల్ కూడా ఇవ్వలేదు. ఇక భారత బౌలర్లు నాలుగు వైడ్లు, ఏడు నోబాల్స్ వేశారు. ముఖ్యంగా ఈ ఏడు నోబాల్స్.. వాటికి ఇచ్చిన ఫ్రీ హిట్లతో కలిపి మొత్తం 38 పరుగులు సమర్పించుకొన్నారు. ఇందులో 18.5 ఓవర్లో షనక ఇచ్చిన క్యాచ్ కూడా నోబాల్ రూపంలో వృథాగా మారి పోయింది. దీంతో చివరి ఓవర్లో అతను రెచ్చిపోయి ఒక్కడే 19 పరుగులు సాధించాడు.