
కొలంబో: కరోనా కలకలంతో జరుగుతుందో లేదో అనుకున్న భారత్, శ్రీలంక రెండో టీ20 ఎట్టకేలకు ప్రారంభమైంది. టీమిండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారిన పడటంతో మంగళవారం జరిగాల్సిన ఈ మ్యాచ్ నేటి(బుధవారం)కి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఈ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ ఛేజింగ్కు అనుకూలమైన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక తెలిపాడు. రమేశ్ మెండీస్ తమ జట్టు తరఫున అరంగేట్రం చేస్తున్నాడని చెప్పిన షనక.. సదీరా సమరవిక్రమా జట్టులోకి వచ్చాడన్నాడు.
ఇక తాము టాస్ గెలిచినా బ్యాటింగే తీసుకునేవాళ్లమని భారత కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. కరోనా కారణంగా జట్టులో 9 మార్పులు జరిగాయని, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియా, నితీశ్ రాణా జట్టులోకి వచ్చారని తెలిపాడు. ఈ అనూహ్య సవాల్ను స్వీకరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని గబ్బర్ చెప్పుకొచ్చాడు. ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా విజయం కోసం సాయశక్తులా ప్రయత్నిస్తామన్నాడు.
కృనాల్తో సహా అతనికి సన్నిహితంగా ఉన్న పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, మనీశ్ పాండేలు ఈ మ్యాచ్తో పాటు చివరి మ్యాచ్కు దూరమయ్యారు. దాంతో భారత్ కేవలం ఐదుగురి బ్యాట్స్మన్తోనే బరిలోకి దిగుతోంది.
ఇక శ్రీలంక జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. చరిత్ అసలంక, అషెన్ బండారా స్థానాల్లో రమేశ్ మెండీస్, సదీరా సమరవిక్రమా వచ్చారు. హార్దిక్ పాండ్యాతో సన్నిహితంగా ఉండటంతోనే చరిత్ అసలంక తప్పుకున్నట్లు తెలుస్తోంది. తన అభిమాని అయిన చరిత్కు పాండ్యా బ్యాట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
తుది జట్లు
భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ , దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్(కీపర్), నితీశ్ రాణా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్, నవ్దీప్ సైనీ, వరుణ్ చక్రవర్తీ, చేతన్ సకారియా
శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), సదీరా సమర విక్రమా, దనుంజయ డిసిల్వా, రమేశ్ మెండీస్, డసన్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, వానిందు హసరంగ, ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ