|
అసలేం జరిగిందంటే..
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా అశ్విన్ వేసిన 21వ ఓవర్లో డీన్ ఎల్గర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ ఓవర్ నాలుగో బంతిని డిఫెన్స్ చేసే ప్రయత్నం చేసాడు. కానీ మిస్సయ్యిన బంతి అతని ప్యాడ్లను తాకింది. దాంతో భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఇక బ్యాట్ తాకిందనే సందేహంతో ఎల్గర్ రివ్యూ తీసుకోగా.. టీవీ రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు. బాల్ ట్రాకింగ్లో బంతి బౌన్స్ అయ్యి వికెట్లను మిస్సయ్యిందని తెలింది. దాంతో థర్డ్ అంపైర్ నాటౌటివ్వగా.. ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
|
కోహ్లీ, అశ్విన్ ఫైర్..
అయితే ఈ నిర్ణయం పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ అశ్విన్ తీవ్ర అసహనానికి గురయ్యారు. అంత క్లియర్గా మిడిల్ స్టంప్ను తాకుతున్నట్లు కనిపించిన బంతి వికెట్లను ఎలా మిస్సవుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ, అశ్విన్ సహనం కోల్పోయి స్టంప్స్ మైక్ ముందు వెళ్లి నోరుపారేసుకున్నారు. 'మ్యాచ్ గెలవడానికి మంచి మార్గాలను ఎంచుకోండి.. సూపర్ స్పోర్ట్(అధికారిక బ్రాడ్కాస్టర్)'అంటూ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. 'బంతికి మెరుగు పెడుతున్నప్పుడు ప్రత్యర్థిపైనే కాదు.. మీ జట్టుపైనా కాస్త శ్రద్ధ పెట్టండి. ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లనే పట్టుకోవాలని చూస్తారు'' అంటూ కోహ్లీ మండిపడ్డాడు.
వికెట్ ఎలా మిస్సయ్యింది..?
ఇక నెటిజన్లు సైతం అశ్విన్ వేసిన ఆ బంతి వికెట్ ఎలా మిస్సవుతుందని ప్రశ్నిస్తున్నారు. బహుషా అశ్విన్ పొడుగున్నాడని, 156 కిలోమీటర్ల వేగంతో బంతిని వేసాడని అలా ఇచ్చారేమోనని సెటైర్లు పేల్చుతున్నారు. అసలు ఆ బంతి వికెట్లను మిస్సయ్యే అవకాశం కూడా లేదని కామెంటేటర్లు కూడా అన్నారు. ఇక ఎట్టకేలకు బుమ్రా బౌలింగ్లో ఎల్గర్ ఔటయ్యాడు. కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌటివ్వగా.. రివ్యూ తీసుకొని భారత్ ఫలితం సాధించింది. ఈ వికెట్తో విరాట్ కోహ్లీ ఆనందానికి హద్దేలేకుండా పోయింది.
భారత్ విజయానికి 8 వికెట్లు..
ఇక 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 రన్స్ చేసింది. సౌతాఫ్రికా విజయానికి 111 పరుగులు అవసరం కాగా.. భారత్ విజయానికి 8 వికెట్లు కావాలి. ఇక ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్(16) విఫలమవ్వగా.. కీగన్ పీటర్సన్(48 బ్యాటింగ్), డీన్ ఎల్గర్(30) రెండో వికెట్కు 78 పరుగులు జోడించారు. ఇక ఎల్గర్ను ఔట్ చేయడంతో మూడో రోజు ఆట ముగిసింది. అంతకుముందు 57/1 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా.. 198 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(100 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు.