IND vs SA: టీమిండియా కొంపముంచిన బౌలర్లు.. సౌతాఫ్రికా ఘన విజయం!

జొహన్నెస్బర్గ్: భారత అభిమానులంతా ఎదురు చూసిన అద్భుతం జరగలేదు. మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు లభించలేదు. అందరూ ఆశించిన చారిత్రాత్మక విజయం దక్కలేదు. పేలవ బ్యాటింగ్కు తోడు చెత్త బౌలింగ్తో టీమిండియా సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది. వాండరర్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ను 1-1తో సమం చేసింది. దాంతో సిరీస్ ఫలితం కోసం మూడో టెస్ట్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వర్షంతో నాలుగో రోజు ఆటలో తొలి రెండు సెషన్లు తుడిచిపెట్టుకుపోయినా.. చివరి సెషన్లో 118/2 ఓవర్నైట్ స్కోర్తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 67.4 ఓవర్లలో మూడు వికెట్లకు 243 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
డీన్ ఎల్గర్ సూపరో సూపర్..
కెప్టెన్ డీన్ ఎల్గర్(188 బంతుల్లో 10 ఫోర్లతో 96 నాటౌట్) అద్భుత పోరాటం కనబర్చగా.. అతనికి డస్సెన్(92 బంతుల్లో 5 ఫోర్లతో 40), టెంబా బవుమా(45 బంతుల్లో 3 ఫోర్లతో 23 నాటౌట్) సహకరించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ దారుణంగా విఫలమయ్యారు. తమ బౌలింగ్తో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.
వర్షం కారణంగా నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైనా.. సఫారీ ఓవర్ నైట్ బ్యాట్స్మన్ డీన్ ఎల్గర్, డస్సెన్ అద్భుతంగా ఆడారు. నిలకడగా ఆడుతూ.. భారత బౌలర్లపైకి ఎదురు దాడికి దిగారు. ఓపికను ప్రదర్శిస్తూనే... వేగంగా పరుగులు రాబట్టారు. ఈ క్రమంలోనే డీన్ ఎల్గర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. డస్సెన్ సైతం ఆ దిశగా అడుగులు వేసాడు. ఇక ఈ పరిస్థితుల్లో బంతిని అందుకున్న మహమ్మద్ షమీ.. సూపర్ డెలివరీతో డస్సెన్ను స్లిప్ క్యాచ్గా పెవిలియన్ చేర్చి భారత శిభిరంలో ఆశలు రేకెత్తించాడు.

విఫలమైన బౌలర్లు...
డస్సెన్ వికెట్తో మూడో వికెట్కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే క్రీజులోకి వచ్చిన టెంబా బవుమాతో ఎల్గర్ ఎలాంటి తప్పిదం చేయకుండా మ్యాచ్ను ముగించాడు. అయితే బవుమా ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను శార్దూల్ జారవిడిచాడు. ఈ అవకాశాన్ని అందుకున్న బవుమా మరో తప్పిదం చేయకుండా తమ కెప్టెన్కు అండగా నిలిచాడు.
ఈ మ్యాచ్లో భారత్ జట్టు సౌతాఫ్రికాకు 240 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌటైంది. అజింక్యా రహానే (78 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 58), చతేశ్వర్ పుజారా (86 బంతుల్లో10 ఫోర్లతో 53) అర్ధ సెంచరీలు చేయగా, హనుమ విహారి (84 బంతుల్లో 6 ఫోర్లతో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే భారత్ మరో 30 పరుగుల అదనంగా చేయాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొంపముంచిన పంత్, సిరాజ్
ఈ మ్యాచ్లో భారత ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం. ఫస్ట్ ఇన్నింగ్స్లో 100 పరుగులు తక్కువ చేయడం.. సెకండ్ ఇన్నింగ్స్లో రహానే, పుజారా మంచి భాగస్వామ్యం అందించినా దాన్ని కొనసాగించలేక మళ్లీ సాధారణ స్కోర్కే పరిమితమవ్వడం భారత్ ఓటమికి ప్రధాన కారణమైంది. ముఖ్యంగా రిషభ్ పంత్ చెత్త బ్యాటింగ్ టీమిండియా కొంపముంచింది. ఇక సౌతాఫ్రికాలో 240 టార్గెట్ చేధించడం కూడా కష్టమే. కానీ భారత ప్రధాన బౌలర్ల వైఫల్యం ఆ జట్టుకు వరమైంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ లేని లోటు కూడా స్పష్టంగా కనిపించింది.

సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 202 ఆలౌట్ (కేఎల్ రాహుల్ 50, రవిచంద్రన్ అశ్విన్ 46, మార్కో జాన్సెన్ 4/31)
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 229 ఆలౌట్( కీగన్ పీటర్సన్ 62, శార్దూల్ ఠాకూర్ 7/61)
భారత్ రెండో ఇన్నింగ్స్: 266 ఆలౌట్( రహానే 58, పుజారా 53, లుంగి ఎంగిడి 3/43)
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 243/3 (డీన్ ఎల్గర్ 96 నాటౌట్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications