పాక్పై ప్రతీకారంతో..
మ్యాచ్ గెలవడానికి టీమిండియా సర్వశక్తులూ ఒడ్డటం ఖాయంగా కనిపిస్తోంది. రెండు నెలల కిందట యునైటేడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన ఆసియా కప్ 2022లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకునే సమయం భారత్కు స్వల్పకాలంలోనే దక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎలాంటి వ్యూహాలను పన్నుతుందనే విషయం ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.
పిచ్పై ద్రావిడ్..
ఈ పరిస్థితుల మధ్య- భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పిచ్ను పరిశీలించారు. సుమారు అరగంటకు పైగా అక్కడే గడిపారు. మెల్బోర్న్ స్టేడియంలో ఒకవంక భారత జట్టు నెట్స్లో తలమునకలై ఉన్న సమయంలో ద్రావిడ్ పిచ్పై కనిపించారు. ఆ సమయంలో ఆయన వెంట పిచ్ క్యూరేటర్, గ్రౌండ్ స్టాఫ్ ఉన్నారు. పిచ్ను చేత్తో కొట్టడం, క్యురేటర్తో మాట్లాడుతూ కనిపించారాయన. పిచ్పై గడ్డి ఎక్కువ ఉండటాన్ని గమనించారు.
పిచ్ ట్రాక్ రికార్డ్ ఇదే..
మెల్బోర్న్ పిచ్ యావరేజ్ 160 -170 పరుగులు. టీ20ల్లో ఈ పిచ్పై ఫాస్ట్ బౌలర్లు మెరుపులు మెరిపించారు. అత్యధిక వికెట్లు తీసుకున్న తొలి అయిదు మంది కూడా ఫాస్ట్ బౌలర్లే కావడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 2016లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా ఇదే మెల్బోర్న్ పిచ్పై 184 పరుగులు చేసింది. మొత్తంగా ఎంసీజీలో నాలుగు టీ20 గేమ్లను ఆడింది. రెండింట్లో గెలిచింది. ఒక మ్యాచ్ను ఓడిపోగా.. మరొకటి ఫలితం తేలలేదు.
పాక్ చేతిలో..
మరోవైపు పాకిస్తాన్ జట్టు ట్రాక్ రికార్డ్ చెప్పుకోదగ్గస్థాయిలో లేదు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్పై. 2010లో ఇక్కడ మ్యాచ్ ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్లో పాక్ ఓడిపోయింది. మెల్బోర్న్ పిచ్పై టీ20 ప్రపంచకప్ 2022లో భారత్- 5, పాకిస్తాన్ ఒకసారి గెలిచాయి. 2021 టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ చేతిలో ఓడింది భారత్. బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు 10 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసింది.