ఓపెనర్లు విఫలం..
177 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే బ్రేస్వెల్ స్టన్నింగ్ డెలివరీకి ఇషాన్ కిషన్(4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(0)ని ఆ మరుసటి ఓవర్లోనే డఫ్ఫీ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ శుభ్మన్ గిల్(7)ను సాంట్నర్ క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో 15 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఆచితూచి ఆడారు. ఈ క్రమంలోనే సాంట్నర్ వేసిన ఆరో ఓవర్ను సూర్య పూర్తిగా మెయిడిన్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 3 వికెట్లకు 33 పరుగులు మాత్రమే చేసింది.
దెబ్బతీసిన ఇష్ సోదీ..
బ్రేస్వెల్ వేసిన 8వ ఓవర్లో హార్దిక్ భారీ సిక్సర్ బాదగా.. సూర్య బౌండరీతో టచ్లోకి వచ్చాడు. అదే జోరులో మరిన్ని బౌండరీలు బాదిన సూర్య.. ఇష్ సోదీ తెలివైన బంతికి క్యాచ్ ఔటయ్యాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బ్రేస్వెల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(21) కూడా ఔటవ్వడంతో మ్యాచ్పై కివీస్ పట్టు బిగించింది. వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా ఇచ్చిన సునాయస క్యాచ్లను కివీస్ ఫీల్డర్లు వదిలేసారు. కానీ ఈ అవకాశాన్ని దీపక్ హుడా(10) అందిపుచ్చుకోలేకపోయాడు. వేగంగా ఆడాలనే ఉద్దేశంతో స్టంపౌటయ్యాడు. క్రీజులోకి వచ్చిన శివమ్ మావి(2) సాంట్నర్ స్టన్నింగ్ త్రోకు రనౌట్గా వెనుదిరగ్గా.. కుల్దీప్ యాదవ్(0) క్యాచ్ ఔటయ్యాడు.
పోరాడిన సుందర్..
క్రీజులోకి వచ్చిన అర్ష్దీప్ సింగ్తో సుందర్ భారీ షాట్లతో అభిమానులను అలరించాడు. టిక్నర్ వేసిన 17వ ఓవర్లో 6, 4 బాదిన సుందర్.. జకోబ్ డఫ్ఫీ వేసిన 19వ ఓవర్లో 6,4, 4 బాదాడు. దాంతో ఒత్తిడికి గురైన డఫ్ఫీ వరుసగా రెండు వైడ్లు వేసాడు. చివరి ఓవర్లో భారత్ విజయానికి 6 బంతుల్లో 33 పరుగులు అవసరమవ్వగా.. రెండో బంతికి సుందర్ సిక్సర్ బాది ఆశలు రేకెత్తించాడు. ఈ సిక్సర్తో టీ20ల్లో ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. కానీ ఫెర్గూసన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సుందర్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో కివీస్ విజయం లాంఛనమైంది.