IND vs NZ: కొంపముంచిన అర్ష్దీప్ సింగ్.. గెలిచే మ్యాచ్లో ఓడిన భారత్!

రాంచీ: సొంతగడ్డపై టీమిండియా జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. వన్డే సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన న్యూజిలాండ్.. మూడు టీ20ల సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. శుక్రవారం రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్.. 21 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52), డారిల్ మిచెల్(30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసి ఓటమిపాలైంది. వాషింగ్టన్ సుందర్(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 47)పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్వెల్, సాంట్నర్, ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీయగా.. ఇష్ సోదీ, జకోబ్ డఫ్ఫీ తలో వికెట్ పడగొట్టారు. టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ తన ఆఖరి ఓవర్లో 27 పరుగులివ్వడం టీమిండియా పతనాన్ని శాసించింది.

ఓపెనర్లు విఫలం..
177 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే బ్రేస్వెల్ స్టన్నింగ్ డెలివరీకి ఇషాన్ కిషన్(4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి(0)ని ఆ మరుసటి ఓవర్లోనే డఫ్ఫీ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ శుభ్మన్ గిల్(7)ను సాంట్నర్ క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో 15 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఆచితూచి ఆడారు. ఈ క్రమంలోనే సాంట్నర్ వేసిన ఆరో ఓవర్ను సూర్య పూర్తిగా మెయిడిన్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 3 వికెట్లకు 33 పరుగులు మాత్రమే చేసింది.

దెబ్బతీసిన ఇష్ సోదీ..
బ్రేస్వెల్ వేసిన 8వ ఓవర్లో హార్దిక్ భారీ సిక్సర్ బాదగా.. సూర్య బౌండరీతో టచ్లోకి వచ్చాడు. అదే జోరులో మరిన్ని బౌండరీలు బాదిన సూర్య.. ఇష్ సోదీ తెలివైన బంతికి క్యాచ్ ఔటయ్యాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బ్రేస్వెల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(21) కూడా ఔటవ్వడంతో మ్యాచ్పై కివీస్ పట్టు బిగించింది. వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా ఇచ్చిన సునాయస క్యాచ్లను కివీస్ ఫీల్డర్లు వదిలేసారు. కానీ ఈ అవకాశాన్ని దీపక్ హుడా(10) అందిపుచ్చుకోలేకపోయాడు. వేగంగా ఆడాలనే ఉద్దేశంతో స్టంపౌటయ్యాడు. క్రీజులోకి వచ్చిన శివమ్ మావి(2) సాంట్నర్ స్టన్నింగ్ త్రోకు రనౌట్గా వెనుదిరగ్గా.. కుల్దీప్ యాదవ్(0) క్యాచ్ ఔటయ్యాడు.

పోరాడిన సుందర్..
క్రీజులోకి వచ్చిన అర్ష్దీప్ సింగ్తో సుందర్ భారీ షాట్లతో అభిమానులను అలరించాడు. టిక్నర్ వేసిన 17వ ఓవర్లో 6, 4 బాదిన సుందర్.. జకోబ్ డఫ్ఫీ వేసిన 19వ ఓవర్లో 6,4, 4 బాదాడు. దాంతో ఒత్తిడికి గురైన డఫ్ఫీ వరుసగా రెండు వైడ్లు వేసాడు. చివరి ఓవర్లో భారత్ విజయానికి 6 బంతుల్లో 33 పరుగులు అవసరమవ్వగా.. రెండో బంతికి సుందర్ సిక్సర్ బాది ఆశలు రేకెత్తించాడు. ఈ సిక్సర్తో టీ20ల్లో ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. కానీ ఫెర్గూసన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సుందర్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో కివీస్ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications