న్యూఢిల్లీ: ఒమన్, యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియానే విజేతగా నిలుస్తుందని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. కోహ్లీసేన 10 వికెట్ల తేడాతో ఓడినా.. టోర్నీలో గొప్పగా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. మెగా టోర్నీ సన్నాహక గేమ్లలో వరుసగా ఇంగ్లండ్ మరియు ఆస్ట్రేలియాలను చిత్తుచేసిన భారత్.. అసలు సమరంలో మాత్రం చిత్తుచిత్తుగా ఓడిపోయింది. పాకిస్థాన్తో గత ఆదివారం జరిగిన టోర్నీ మొదటి మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్లో తేలిపోయిన కోహ్లీసేన మూల్యం చెల్లించుకుంది. ఇక సూపర్ 12లో ఆడే ప్రతి మ్యాచ్ టీమిండియాకు కీలకమే.
గ్రూప్-2లో పాకిస్థాన్ ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి టైటిల్ రేసులో ఫేవరెట్గా ముందుకు దూసుకెళుతోంది. గ్రూప్-2 నుంచి రెండో జట్టుగా సెమీస్లో అర్హత సాధించేందుకు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు ప్రధానంగా పోటీపడుతున్నాయి. ఈనెల 31న భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకం కానుంది. ఎందుకంటే ఇందులో ఓడిన జట్టు సెమీస్కు చేరడం కష్టంగా మారే అవకాశం ఉంది. గెలిచిన జట్టు మాత్రం సెమీస్ దిశగా మరో అడుగు వేయనుంది.
Harbhajan Singh: 'అఫ్గానిస్థాన్ను తక్కువ అంచనా వేయొద్దు.. ఏ జట్టునైనా ఓడించగలదు'
గ్రూప్-2లో భాగంగా భారత్ జట్టు తన తర్వాత మ్యాచ్ని న్యూజిలాండ్తో ఆదివారం ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలవగలిగితే.. ఆ తర్వాత అఫ్గానిస్థాన్ (నవంబరు 3), స్కాట్లాండ్ (నవంబరు 5), నమీబియా (నవంబరు 8) జట్లపై గెలవడం పెద్దగా కష్టమేమీ కాకపోవచ్చు. కాబట్టి న్యూజిలాండ్పై గెలవడమే ఇప్పుడు టీమిండియా ముందున్న అతిపెద్ద సవాల్. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్ సన్నద్ధత మొదలుపెట్టింది. ఇక మెంటార్ ఎంఎస్ ధోనీ జట్టుతో ఉండడం కోహ్లీసేనకు లాభించే అంశమే. కివీస్ మ్యాచ్ కోసం మహీ ఎలాంటి ప్రణాళికలు రాచించాడో చూడాలి.
వీరేంద్ర సెహ్వాగ్ తన ఫేస్బుక్ షో వీరగిరి డాట్ కామ్లో మాట్లాడుతూ... 'నా అంచనా ప్రకారం ఈ టీ20 ప్రపంచకప్ను టీమిండియా గెలుస్తుంది. మెగా టోర్నీలో ఇప్పటి నుంచి భారత్ మెరుగైన క్రికెట్ ఆడవలసి ఉంటుంది. ప్లేయర్స్ అందరూ రాణిస్తారని నమ్మకం ఉంది. భారత్ ఎప్పుడు గెలిచినా మనం ఉత్సాహపరుస్తాము. అలానే ఓడిపోనప్పుడు కూడా టీమిండియాకి అంతకమించి మనం మద్దతు తెలపాలి. కాబట్టి భారత్ టీ20 ప్రపంచకప్ను గెలుస్తుందని నేను నమ్ముతున్నా' అని అన్నాడు.