
ఇండోర్: టీమిండియా స్టార్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ సెంచరీలు సాధించారు. న్యూజిలాండ్తో ఇండోర్ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో ముందుగా రోహిత్ శర్మ(85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 101) సెంచరీ సాధించగా.. ఆ వెంటనే యువ ఓపెనర్ శుభ్మన్ గిల్(73 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్లతో 104 బ్యాటింగ్) శతక్కొట్టాడు. ఈ సిరీస్లో శుభ్మన్ గిల్కు రెండో సెంచరీ కాగా.. మూడేళ్ల తర్వాత రోహిత్ శర్మ శతకం సాధించాడు. చివరిసారిగా 2020లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియా సెంచరీ బాదిన రోహిత్.. గత మూడేళ్లుగా నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడ్డాడు.
ఈ సెంచరీతో వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో రోహిత్.. రికీ పాంటింగ్ సరసన నిలిచాడు. 365 ఇన్నింగ్స్ల్లో రికీ పాంటింగ్ 30 సెంచరీలు బాదగా.. రోహిత్ శర్మ 234 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 49(452 ఇన్నింగ్స్ల్లో) సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 46 (261 ఇన్నింగ్స్ల్లో) సెంచరీలతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్కు ముందే సెంచరీ చేస్తానని చెప్పిన రోహిత్.. ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో 6 సిక్స్లు బాదిన రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య(272)ను రోహిత్(272) అధిగమించాడు. షాహిద్ అఫ్రిది(351), క్రిస్ గేల్(331) రోహిత్ కన్నా ముందున్నారు.
సెంచరీ అనంతరం రోహిత్ శర్మను మైఖేల్ బ్రేస్వెల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో తొలి వికెట్కు నమోదైన 212 పరుగుల రికార్డు భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి విరాట్ కోహ్లీ రాగా.. శుభ్మన్ గిల్ భారీ షాట్లతో అలరించాడు. కానీ టిక్నర్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో 230 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోగా.. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు.
ఈ మూడు వన్డేల సిరీస్లో శుభ్మన్ గిల్ 208, 40 నాటౌట్, 112 పరుగులతో రాణించాడు. 3 ఇన్నింగ్స్ల్లో 180 యారేజ్తో 360 పరుగులు చేశాడు. ఓ వన్డే సిరీస్లో 300 ప్లస్ పరుగులు చేసిన ఏకైక ప్లేయర్గా శుభ్మన్ గిల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. రోహిత్-శుభ్మన్ గిల్ రెండో సారి 100 ప్లస్ పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.