హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ను టీమిండియా ఆటగాళ్లు కలిసారు. న్యూజిలాండ్తో తొలి వన్డే కోసం హైదరాబాద్ వచ్చిన భారత ఆటగాళ్లు.. ఎన్టీఆర్ను కలిసి సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. టీమిండియా యువ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, శుభ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్లు ఎన్టీఆర్ను కలిసిన వారిలో ఉన్నారు. సతీమణి దేవిశాతో కలిసి సూర్య.. ఎన్టీఆర్తో ప్రత్యేకంగా ఫొటో దిగాడు.
ఈ ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న సూర్యకుమార్ యాదవ్.. 'బ్రదర్, నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిచినందుకు మరోసారి కంగ్రాట్స్'అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్కు ఎన్టీఆర్ స్పందించాడు. 'సూర్య, థ్యాంక్యూ సో మచ్. నిన్ను కలవడం నాకూ ఆనందంగా ఉంది. రేపటి మ్యాచ్లో దుమ్మురేపు.'అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్లు నెట్టింట వైరల్గా మారాయి.
ఎన్టీఆర్ను టీమిండియా క్రికెటర్లు కలవడంపై అతని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ క్రేజ్ మాములుగా లేదు కదా..? అని కామెంట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన 'టెంపర్' సినిమా నుంచి చాలా సెలక్టివ్గా ఎన్టీఆర్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. ప్రతీ సినిమా కథలోనూ వైవిధ్యం చూపించి, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఏరికోరి ఎంచుకున్న ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో నాలుగోసారి చేసిన సినిమా 'RRR'. గత ఏడాది ఐపీఎల్ సమయంలో విడుదలైన ఈ సినిమా అఖండ విజయం అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కిన విషయం తెలిసిందే.
శ్రీలంకతో టీ20 సిరీస్లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. న్యూజిలాండ్తో తొలి వన్డేలో అతనికి చోటు దక్కుతుందా? లేదా? అనేది చూడాలి. కాగా, భారత్ టీమ్ న్యూజిలాండ్తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లు ఆడనుంది. బుధవారం హైదరాబాద్ వేదికగా తొలి వన్డే జరగనుండగా.. 21, 24 తేదీల్లో చివరి రెండు వన్డేలు జరగనున్నాయి. జనవరి 27, 29, ఫిబ్రవరి 1 తేదీలలో మూడు టీ20లు జరుగుతాయి.