చెలరేగిన సిరాజ్..
350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(10)ను మహమ్మద్ సిరాజ్ షాట్ పిచ్ బాల్తో పెవిలియన్ చేర్చాడు. అనంతరం మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం శార్దూల్ ఠాకూర్.. ఫిన్ అలెన్(40)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే హెన్రీ నికోల్స్(18)ను కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్లో డారిల్ మిచెల్(9) వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.
కుల్దీప్ డబుల్ స్ట్రైక్..
క్రీజులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్ను మహమ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేయగా.. కెప్టెన్ టామ్ లాథమ్(24)ను సిరాజ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో న్యూజిలాండ్ 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితిల్లో క్రీజులోకి వచ్చిన మైకేల్ బ్రేస్ వెల్, మిచెల్ సాంట్నర్ అసాధారణ ప్రదర్శన కనబర్చారు. బ్రేస్ వెల్ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగగా.. సాంట్నర్ యాంకర్ రోల్ పోషించాడు. ఠాకూర్ వేసిన 37వ ఓవర్లో 4,6, 4తో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
శతక్కొట్టిన బ్రేస్ వేల్..
అనంతరం మరింత ధాటిగా ఆడిన బ్రేస్ వెల్.. శార్దూల్ ఠాకూర్నే టార్గెట్ చేశాడు. ఓవర్కు ఓ సిక్స్ బాదుతూ జట్టు స్కోర్ను పరుగెత్తించాడు. షమీ వేసిన 43వ ఓవర్లో సిక్స్ బాది 57 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నుంచి సెంచరీ అందుకున్నాడు. ఆ వెంటనే మిచెల్ సాంట్నర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ముఖ్యంగా బ్రేస్వెల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
మలుపు తిప్పిన సిరాజ్..
సిరాజ్ 46వ ఓవర్లో వరుస బంతుల్లో సాంట్నర్తో పాటు షిప్లేను ఔట్ చేసి భారత విజయవకాశాలను మెరుగుపరిచాడు. సాంట్నర్ వికెట్తో ఏడో వికెట్కు నమోదైన 162 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. సాంట్నర్ ఔటైనా.. బ్రేస్వెల్ మాత్రం భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 48వ ఓవర్లో షమీ 17 పరుగులు ఇవ్వడంతో న్యూజిలాండ్ విజయానికి 12 బంతుల్లో 24 పరుగులు అవసరమయ్యాయి.
అయితే 49వ ఓవర్లో హార్దిక్ పాండ్యా.. ఫెర్గూసన్ ఔట్ చేయగా.. ఈ ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో ఆఖరి ఓవర్లో కివీస్ విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ తొలి బంతిని బ్రేస్ వెల్ సిక్సర్ బాదడంతో ఉత్కంఠగా మారింది. అయితే రెండో బంతికి బ్రేస్ వెల్ వికెట్ల ముందు దొరికిపోవడంతో మ్యాచ్ భారత్ వశమైంది.