
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. నెట్స్లో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన రాకాసి బౌన్సర్ మయాంక్ తలకు బలంగా తాకింది. హెల్మెట్ ఉన్నప్పటికీ బంతి బలంగా తాకడంతో మయాంక్ కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే టీమ్ ఫిజియోలు హుటాహుటిన అక్కడికి చేరి పరీక్షించారు. ప్రస్తుతం అతను మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. దాంతో మయాంక్ ఫస్ట్ టెస్ట్కు దూరమయ్యాడు.
ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలిపింది. 'ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలోని నెట్ సెషన్లో సోమవారం ప్రాక్టీస్ చేస్తూ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ గాయపడ్డాడు. బంతి అతని హెల్మెట్కు బలంగా తాకింది. ప్రస్తుతం అతను మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. అతనికి కంకషన్ టెస్ట్ పూర్తయింది. అతనిలో కంకషన్ లక్షణాలు కనిపించాయి. దాంతో తొలి టెస్ట్కు దూరమయ్యాడు. ప్రస్తుతం 30 ఏళ్ల మయాంక్ నిలకడగానే ఉన్నాడు.'అని బీసీసీఐ సెక్రటరీ జైషా ఆ ప్రకటనలో స్పష్టం చేశాడు.
ఇక ఆగస్టు 4(బుధవారం) నుంచి ఇంగ్లండ్తో నాటింగ్హోమ్ వేదికగా ఫస్ట్ టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మతో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేస్తాడని అంతా భావించారు. కేఎల్ రాహుల్ మిడిలార్డర్లో ఆడుతారనుకున్నారు. కానీ మయాంక్ అనూహ్యంగా కంకషన్తో తప్పుకోవడంతో ఓపెనర్గా ఎవరిని బరిలోకి దించాలా? అనే సందిగ్ధత కోహ్లీసేనలో నెలకొంది.
ఇప్పటికే మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ గాయపడి టూర్ నుంచి తప్పుకున్నాడు. దాంతో కేఎల్ రాహుల్ను ఓపెనర్గా బరిలోకి దించక తప్పేలా లేదు. పశ్చిమ బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ కూడా బ్యాకప్ ఓపెనర్గా అందుబాటులో ఉన్నాడు. గిల్ స్థానంలో పృథ్వీ షా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పటికీ అతను కరోనా నిబంధనల కారణంగా ఫస్ట్ టెస్ట్కు అందుబాటులో లేడు.
ఇక ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీసేనను గాయాల బెడద వేదిస్తూనే ఉంది. మొకాలి గాయంతో గిల్, ప్రాక్టీస్ మ్యాచ్లో అవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ వేలి గాయాలతో సిరీస్ ప్రారంభానికి ముందే తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పుడు మయాంక్ చేరాడు. ఐదు టెస్ట్ల సిరీస్ ముగిసే వరకు ఇంకెంతమంది గాయపడుతారో అనే భయాందోళన జట్టులో నెలకొంది.