హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్లో సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే చివరి టీ20కి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న ఈ మ్యాచ్కు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే మూడో టీ20కి సర్వం సిద్ధం చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.
మూడో టీ20పై గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది కాబట్టి, సాయంత్రం 4 గంటలకు స్టేడియం గేట్లు ఓపెన్ చేస్తామని సీపీ తెలిపారు. 1800 మంది పోలీసులతో స్టేడియం దగ్గర్లో భారీ భద్రత ఏర్పాటు చేశామని అన్నారు.

స్టేడియం పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయబడి ఉన్నాయని ఆయన తెలిపారు. మొబైల్ ఫోన్ను స్టేడియంలోకి అనుమతిస్తున్నామని చెప్పిన ఆయన, పవర్ బ్యాంక్ను మాత్రం తీసుకురావద్దని ఈ సందర్భంగా చెప్పారు.
దీంతో పాటు లాప్టాప్స్, కెమెరాలు, హెల్మెట్లు, బ్యాగులు, పెన్నులు, సిగిరేట్లు, అగ్గిపెట్టె, లైటర్, వాటర్ బాటిల్స్కు స్టేడియంలో అనుమతి లేదని అన్నారు. దాదాపు తొమ్మిది వేలకు పైగా వాహనాలు స్టేడియంకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కారు పార్కింగ్ కోసం రామంతపూర్ వైపు ఉంటే ఎల్జీ గోడౌన్ వద్ద పార్క్ చేసి గేట్ 1, 2 ద్వారా వెళ్లాలని అభిమానులకు సూచించారు.
అమ్మాయిలను వేధించే పోకిరీలను కట్టడి చేసేందుకు షీ టీమ్స్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో నిఘా వేసి ఉంటాయని అన్నారు. ఇక, వర్షం పడకుంటే మ్యాచ్ ప్రశాంతంగా జరుగుతుందని, ఒక వేళ వర్షం పడితే కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందే సన్నద్దమయ్యాని ఆయన తెలిపారు. వర్షం పడితే తడవకుండా ఉండేందుకు గాను రోప్ వద్దకు వెళ్లాలని సూచించారు.