హైదరాబాద్: (క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా)బీసీసీఐ తాజాగా 27 మంది ప్లేయర్లను సెంట్రల్ కాంట్రాక్టు నిమిత్తం ఎంపిక చేసింది. జీతాల విషయంలో ఇప్పటికే ప్రతిపాదన చేసిన ఏ ప్లస్ గ్రేడ్ అంటే మూడు ఫార్మాట్లలోనూ ఆడగల ప్లేయర్లు అంటూ ప్రకటించిన బీసీసీఐ.. భారత్ ఏ జట్టును కూడా మూడు ఫార్మాట్లలో ఆడేలా తయారుచేస్తోంది. ఇలా జూన్ నెల నుంచి సెప్లెంబర్ వరకూ జరగనున్న పలు రకాల టోర్నమెంట్లలో 102 మంది ప్లేయర్ల వరకూ 13జట్లుగా బీసీసీఐ ఎంపిక చేసింది.
ఈ క్రమంలో అందరినీ ఒకే స్థాయిలో తయారుచేస్తే సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లకు జాతీయ జట్టులో స్థానం దక్కే అవకాశాలు లేవంటూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్లస్ గ్రేడ్ జీతం తీసుకుంటూ జాతీయ జట్టుకు ఆడకపోవడం ఒక నష్టమైతే.. నాన్ కాంట్రాక్ట్డ్ ప్లేయర్ను అతని స్థానంలో ఆడించడం ఆటగాడికి నష్టం. ఇలాగే పార్థివ్ పటేల్ విషయంలోనూ తాజాగా జరిగింది.
అన్ క్యాప్డ్ ప్లేయర్ రిషబ్ పంత్ను జాతీయ జట్టులోకి టెస్టు సిరీస్లోకి తీసుకున్న బీసీసీఐ అనుభవజ్ఞుడైన పార్థివ్ పటేల్ను దూరం పెట్టేసింది. అతణ్ని కనీసం భారత్ ఏ జట్టులోకి కూడా తీసుకోకపోవడం గమనార్హం. కొద్ది నెలలుగా ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో కొనసాగుతోన్న సెలక్షన్ కమిటీ పలు టోర్నమెంట్లలో క్రికెటర్ల ఎంపికను పర్యవేక్షిస్తోంది. గతేడాది 28 దేశీవాలీ జట్లున్న జాబితాను ప్రస్తుతం 37 జట్లకు పెంచారు. ఇలా పెంచుకుంటూ 420 క్రికెటర్ల వరకూ జాబితాను పెంచేశారు.
అయితే దీనిపై వివరణ ఇస్తూ.. ఇలా భారత్ ఏ జట్టును అన్ని ఫార్మాట్లలో ఆడిస్తూ సీనియర్ జట్టుకు అన్ని వేళలా అందుబాటులో ఉండేందుకు సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇలా ఒక క్రికెటర్పై నమ్మకం లేకుండా ఆటగాళ్లను మారుస్తూ ఆడించడం జట్టుపై ప్రయోగించడం లాంటిదేనని, ఆటగాళ్లు ఒకటి రెండు మ్యాచ్లలో ఆడకపోయినా అవకాశాలు ఇస్తే తర్వాతి మ్యాచ్లలో రాణిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.