చాన్స్లు రాక అల్లాడిపోయాడు..
'గత మూడేళ్లుగా కుల్దీప్ యాదవ్ అవకాశాల్లేక అల్లాడిపోయాడు. టెస్ట్, వన్డే, టీ20.. చివరకు ఐపీఎల్లో కూడా అతనికి ఎవరూ అవకాశం ఇవ్వలేదు. కేకేఆర్ అయితే అతనిపై కనీసం నమ్మకం కూడా ఉంచలేదు. దాంతో కుల్దీప్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. నాతో టచ్లో ఉన్న అతను అవకాశాలు రావడం లేదని ఆవేదన చెందాడు. నేను మాత్రం ఆశ కోల్పోవద్దని చెప్పాను. ట్రైనింగ్ కొనసాగించాలని, ప్రాక్టీస్ సెషన్స్ మిస్సవ్వకుండా మరింత కష్టపడమని సూచించా.
తక్కువ ధరే అయినా..
ఈ సీజన్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రూ.2 కోట్ల కనీస ధరకు తీసుకుంది. నేను వెంటనే ప్రైజ్ ట్యాగ్ చూడవద్దని కుల్దీప్కు చెప్పా. మంచి టీమ్ నిన్ను ఎంచుకుందని, నీకు చాలా అవకాశాలు వస్తాయని తెలిపా. దానికి అతను ఐపీఎల్లో సత్తా చాటి భారత్ తరఫున మళ్లీ అన్ని ఫార్మాట్లలో ఆడాలనుకుంటున్నానని చెప్పాడు. అవకాశాల కోసం అతను చాలా ఆకలిగా ఉన్నాడని అర్థమైంది. వరుస అవకాశాలిస్తూ కుల్దీప్కు అండగా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్కు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
కేకేఆర్కు ఓ దండం..
కుల్దీప్ యాదవ్ను వదిలేసి కేకేఆర్ మంచి పని చేసింది. ఇది కుల్దీప్కు చాలా కలిసొచ్చింది. కుల్దీప్ గనుక ఈ సీజన్ కూడా కేకేఆర్లో ఉండి ఉంటే క్రికెటర్గా అతని కెరీర్ నాశనమయ్యేది. కేకేఆర్ గతేడాది అతన్ని రిటైన్ చేసుకొని ఒక్క అవకాశం ఇవ్వలేదు. అది తనను షాక్కు గురి చేసింది'అని కపిల్ దేవ్ పాండే చెప్పుకొచ్చాడు. ఇక వరుణ్ చక్రవర్తీ కారణంగా కుల్దీప్ యాదవ్ కేకేఆర్ తరఫున ఒక్క అవకాశం అందుకోలేకపోయాడు. గతేడాది అతను అద్భుత ప్రదర్శన కనబర్చడంతో కుల్దీప్ బెంచ్కే పరిమితమయ్యాడు.
9 మ్యాచ్లు.. 17 వికెట్లు..
ఈ సీజన్లో ఢిల్లీ ఆడిన 9 మ్యాచ్ల్లో బరిలోకి దిగిన కుల్దీప్ యాదవ్ 17 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో 4 వికెట్ల ఘనతను రెండుసార్లు అందుకున్నాడు. ఇప్పటికే ఈ సీజన్లో అతను 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. గతంలో వికెట్ల వెనుకాల మహేంద్ర సింగ్ ధోనీ అండతో చెలరేగిన కుల్దీప్ యాదవ్.. మళ్లీ అలాంటి సపోర్ట్ రిషభ్ పంత్ నుంచి లభిస్తుండటంతో రాణిస్తున్నాడు. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ సైతం కుల్దీప్కు అండగా నిలుస్తుండటం అతనికి కలిసి వస్తోంది.