హైదరాబాద్: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో సిల్లీ తప్పిదం చేసిన హార్దిక్ పాండ్యాను తనతో పోల్చవద్దంటూ లెజెండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ అన్నాడు. సెంచూరియన్లోని సూపర్ స్టోర్స్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో పాండ్యా సిల్లీగా రనౌట్ అయిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా పాండ్యా క్రీజులో నిర్లక్ష్యంగా వ్యవహారించి తన వికెట్ను సమర్పించుకున్నాడు. కేప్ టౌన్ టెస్టులో ఓటమి పాలు కాడవంతో రెండో టెస్టు ఎంతో కీలకంగా మారింది. అలాంటి కీలక మ్యాచ్లో పాండ్యా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి రనౌట్గా కావడం విమర్శకుల నోటికి పనిచెప్పింది.
కేప్టౌన్ టెస్టులో పాండ్యా 94 పరుగులు చేయడంతో లెజెండరీ ఆల్రౌండర్ కపిల్ దేవ్ తర్వాత అంతటి నైపుణ్యమున్న ఆటగాడంటూ పొగిడిన వారే ఇప్పుడు పాండ్యా తీరుపై మండిపడుతున్నారు. తాజాగా కపిల్ దేవ్ కూడా పాండ్యా రనౌట్పై స్పందించాడు. తాను ఏ మ్యాచ్ ఆడినా సీరియస్గా ఆడేవాడినని, సిల్లీ తప్పిదం చేసిన పాండ్యాను తనతో పోల్చవద్దని తేల్చి చెప్పాడు.
'పాండ్యాలో గొప్ప టాలెంట్ ఉన్న క్రికెటర్. ఇది కేప్టౌన్లో జరిగిన తొలి టెస్టులో చూశాం. అయితే అతను మానసికంగా చాలా పరిపక్వత సాధించాల్సి ఉంది. రెండో టెస్టులో మాత్రం పాండ్యా చాలా సిల్లీగా రనౌటయ్యాడు. ఆ తరహా తప్పిదాలు చేస్తున్నట్లయితే హార్దిక్తో నన్ను పోల్చకండి' అని కపిల్ దేవ్ అన్నాడు.
'అతను గేమ్ను సిరీయస్గా తీసుకోలేకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తరహాలో రనౌటైన హార్దిక్కు నాతో పోలిక సరికాదు' అని కపిల్ చెప్పాడు. అసలేం జరిగిందంటే... 183/5 ఓవర్నైట్ స్కోరుతో మూడోరోజు ఆట ఆరంభించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
రనౌట్ రూపంలో హార్దిక్ పాండ్యా (15) పెవిలియన్కు చేరాడు. రబడ వేసిన బంతిని స్టైట్గా ఆడిన పాండ్యా.. సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే అవతలి ఎండ్లో ఉన్న కెప్టెన్ కోహ్లీ వెనక్కి వెళ్లాలని సూచించాడు. అయితే వెంటనే వెనక్కి తిరిగిన పాండ్యా నెమ్మదిగా పరిగెత్తుతూ క్రీజులోకి చేరాడు.
అయితే తన బ్యాట్ను ముందుగా క్రీజులో ఉంచలేదు. ఈ లోపల ఫిలాండర్ విసిరిన త్రో వికెట్లను గిరాటేసింది. బాల్ వికెట్లను తాకే సమయానికి పాండ్యా క్రీజులోకి వచ్చినప్పటికీ అతని కాలు, బ్యాటు గాల్లో ఉన్నాయి. దీంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించారు. కోహ్లీ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Today Hardik Pandya proved he is more dumber than Alia Bhatt. #SAvIND pic.twitter.com/xcpjuHDKDA
— Waѕiyullah Budye (@WasiyullahB) January 15, 2018
టీమిండియా మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ కూడా కపిల్ వ్యాఖ్యలతో ఏకీభవించాడు. ఆ ఇద్దర్నీ ఒకే రకంగా పోల్చడం అప్పుడే సరికాదని అన్నాడు. ఇంకా క్రికెట్ కెరీర్ ఆరంభ దశలోనే ఉన్న హార్దిక్ పాండ్యా చాలా నేర్చుకోవాలని సూచించాడు.
'కపిల్ దేవ్తో కలిసి ఎన్నో ఏళ్లు క్రికెట్ ఆడా. వీరిద్దరికీ ఎక్కడా పోలిక లేదు. తన అద్భుతమైన ప్రదర్శనతో కపిల్ దేవ్ 15 ఏళ్ల పాటు భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. పాండ్యా ప్రస్తుతం ఐదో టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడుతున్నాడు. అతడు చాలా నేర్చుకోవాల్సి ఉంది' అని సందీప్ పాటిల్ అన్నాడు.