ధోనికి బ్యాకప్ కీపర్ను తీసుకోవడం వల్ల
ఈ మెగా టోర్నీలో ధోనికి బ్యాకప్ కీపర్ను తీసుకోవడం వల్ల ఒక స్థానం వృథా చేసినట్లే అని హర్భజన్ తెలిపాడు. గాయం కారణంగా ఏదైనా మ్యాచ్కి ధోని దూరమైతే అతడి స్థానంలో కేఎల్ రాహుల్ను ఆడించటం మంచిదని భజ్జీ తెలిపాడు. రిషభ్ పంత్ లేదా దినేశ్ కార్తీక్... ధోనికి బ్యాకప్ కీపర్లుగా తీసుకోవడం వల్ల ఒక స్థానం వృధా చేసినట్లు అవుతుందని అన్నాడు.
ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో
తాజాగా సోమవారం ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ "ధోనితో కలిసి క్రికెట్ ఆడుతున్నాను కాబట్టి అతడికి వెన్నునొప్పి ఒక సమస్యగా ఉందన్న విషయం తెలుసు. అయితే, ఆ సమస్య ఉన్నప్పటికీ ధోని దానిని అధిగమిస్తాడనే నమ్మకం నాకుంది. ధోనికి బ్యాకప్ వికెట్ కీపర్ అవసరం లేదు. వరల్డ్కప్లో ఏదైనా మేజర్ గాయం అయితే తప్ప. అలాంటి సమయంలో కేఎల్ రాహుల్ సేవలను వినియోగించుకోవచ్చు" అని అన్నాడు.
విజయ్ను నాలుగో స్థానంలో తీసుకోవాలన్న
"విజయ్ను నాలుగో స్థానంలో తీసుకోవాలన్న ఆలోచనను సైతం ఇది దెబ్బతీస్తుంది. మరోవైపు అంబాటి రాయుడిని కూడా ఈ స్థానంలో తీసుకోవచ్చు. అయితే, ఇటీవలి కాలంలో రాయుడు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అందుకే కేఎల్ రాహుల్కు జట్టులో స్థానం కల్పిస్తే బాగుంటుంది. వికెట్ కీపింగ్కు దూరంగా ఉన్నా... బ్యాటింగ్లో రాహుల్ సేవలను వినియోగించుకోవచ్చు" అని భజ్జీ అన్నాడు.
నవదీప్ షైనీని నాలుగో సీమర్గా
అన్ని ఫార్మాట్లలో గత కొంతకాలంగా అధ్భుత ప్రదర్శన చేస్తోన్న నవదీప్ షైనీని నాలుగో సీమర్గా తీసుకోవాలని భజ్జీ సూచించాడు. "ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేస్తున్నాడని కాదు... గతంలో అతడు అనేక రంజీ మ్యాచ్ల్లో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దేశవాళీ క్రికెట్లో చక్కగా రాణిస్తున్నాడు" అని అన్నాడు. నవదీప్ షైనీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో వికెట్లు తీయకున్నా... తన బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు.