దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రతినెలా 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జనవరి నెలకుగానూ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుకు నామినేట్ అయిన క్రికెటర్ల జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఇందులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ ఉన్నారు.
ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్లో మూడు టెస్టులు ఆడిన రిషభ్ పంత్.. సిడ్నీ టెస్టులో 97, గబ్బాలో 89 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. శ్రీలంకపై టెస్టు సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకోవడంలో ఇంగ్లండ్ సారథి జో రూట్(228,186) కీలకంగా వ్యవహరించాడు.యూఏఈ, అఫ్గానిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్లో ఐర్లాండ్ ఆటగాడు స్టిర్లింగ్ మూడు సెంచరీలు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ అద్భుత ప్రదర్శన కారణంగానే ఐసీసీ ఈ ముగ్గరిని ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది జనవరి అవార్డుకు నామినేట్ చేసింది.
మహిళా క్రికెటర్స్లో దియానా బైగ్(పాకిస్థాన్), శభ్నిమ్ ఇస్మయిల్, మరిజన్నె కప్(ఇద్దరు దక్షిణాఫ్రికా) ఈ రేసులో ఉన్నారు. వీరిలో బైగ్ వన్డేల్లో 13.22 ఎకానమీతో 9 వికెట్లు తీయగా.. ఇస్మాయిల్ 4.57 ఎకానమీతో టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టింది. మరిజన్నె వన్డేల్లో 115 బంతుల్లో 115 పరుగులు చేసింది. నామినేట్ అయిన ఆటగాళ్లను మాజీ క్రికెటర్లు, జర్నలిస్టులతో కూడిన ఐసీసీ స్వతంత్ర ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల ఓట్లను పరిగణనలోకి తీసుకుని విజేతలుగా ప్రకటిస్తారు.
మూడు ఫార్మాట్లలోని ప్రతీ క్యాటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో సాధించిన విజయాల ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్ లిస్ట్లో స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీ, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఐసీసీ డిజిటల్ ఛానెళ్లలో నెలలో ప్రతి రెండవ సోమవారం విజేతలను ప్రకటిస్తారు. అంటే ఫిబ్రవరి ఏడున జనవరికి సంబంధించిన విజేతలెవరో తెలియనుంది.