

హైదరాబాద్: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఐసీసీ అభిమానిగా మారిపోయింది. ఇందుకు కారణం ఐసీసీ చేసే ట్వీట్లే. రెండో టీ20లో ధోని స్టంపింగ్ను చూసిన ఐసీసీ "ధోని వికెట్ల వెనకాల ఉంటే.. క్రీజు వదిలే ధైర్యం చేయకండి" అంటూ ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మెన్ను హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తాజాగా ధోనిపై మరో ట్వీట్ చేసింది. న్యూజిలాండ్తో జరిగిన చివరి టీ20 ధోనీకి 300వది కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్క్ని ఇప్పటి వరకూ 11 మంది క్రికెటర్లు అందుకోగా.. 12వ క్రికెటర్గా ధోనీ తాజాగా నిలిచాడు. కానీ.. భారత్ తరఫున మాత్రం మొట్టమొదటి క్రికెటర్గా ఘనత సాధించాడు.
టీమిండియా తరఫున 95 టీ20 మ్యాచ్లాడిన ధోనీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 205 మ్యాచ్లు ఆడాడు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 185 మ్యాచ్లుకాగా.. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ (ప్రస్తుతం టోర్నీలో ఈ టీమ్ లేదు) తరఫున 20 మ్యాచ్లు ఆడాడు.
ఇలా భారత్ తరుపున అత్యధిక టీ20లు ఆడిన తొలి క్రికెటర్గా ధోనీ నిలిచాడు. అంతేకాదు మూడో టీ20లో ధోని స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. బ్యాట్తో విఫలమైనా.. ఓ మెరుపు స్టంపింగ్తో తన మార్క్ చూపించాడు. మూడో టీ20 అనంతరం ఐసీసీ వరుస ట్వీట్లతో మరోసారి వార్తల్లో నిలిచాడు.
వరల్డ్ ఫేమస్ బ్యాండ్ బీటిల్స్ కో ఫౌండర్, సింగర్ జాన్ లెనన్ పాడిన ఇమాజిన్ పాటను గుర్తు చేస్తూ ఐసీసీ వరుసగా ట్వీట్లు చేస్తూ వెళ్లింది. "అంపైర్ లేని క్రికెట్ను ఊహించండి.. అన్ని మ్యాచ్లు ఏడాదంతా ఆడితే ఎలా ఉంటుందో ఊహించండి" అంటూ ఐసీసీ తన ట్విట్టర్లో ట్వీట్లు పోస్టు చేసింది.
ధోనీ లేని క్రికెట్ ఎలా ఉంటుందో ఊహించండి.. ఆ ఊహే చాలా కష్టంగా ఉంటుంది.. మిమ్మల్ని స్టంప్ లేదా క్యాచ్ ఔట్ చేయడానికి ఎవరూ ఉండరు. మీతో పరిహాసాలు ఆడటానికీ ఎవరూ ఉండరు లాంటి ట్వీట్లు అభిమానులను ఎంతగానో అలరించాయి. ఈ ట్వీట్లు మీకోసం .....