హైదరాబాద్: క్రికెట్లో అవినీతికి వ్యతిరేకంగా వస్తున్న స్పందన పట్ల ఐసీసీ హర్షం వ్యక్తం చేస్తుంది. ఫిక్సింగ్కు పాల్పడమని తమను కొందరు సంప్రదించారని అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదు చేశారని వెల్లడించింది. ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ (ఏసీయూ)ను ఏడాదిలో నలుగురు అంతర్జాతీయ కెప్టెన్లు సంప్రదించారు. ఈ మేరకు అవినీతికి సంబంధించి 2017-18లో మొత్తం కేసులను ఏసీయూ విచారించినట్టు వెల్లడించింది.
క్రికెట్లో అవినీతిపై గత జూన్ 1 నుంచి ఈ ఏడాది మే 31 మధ్య కాలంలో అందిన 18 ఫిర్యాదులపై విచారణ చేపట్టామని, అందులో ఐదు ముగిశాయని గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి జనరల్ మేనేజర్గా అలెక్స్ మార్షల్ నియమితులైన తర్వాతి నుంచి ఇలాంటి వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ మేరకు ఫిర్యాదు చేస్తున్న ఆటగాళ్ల సంఖ్య పెరగడం శుభసూచకమని ఐసీసీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. వారిలో నలుగురు కెప్టెన్లున్నారని చెప్పింది.
ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నేపథ్యంలో.. ఆట నుంచి అవినీతిని పెకిలించి వేయడం అతిపెద్ద సమస్యగా పరిణమించిందని ఐసీసీ వివరించింది. పలు దేశీవాళీ లీగ్లతో పాటు, ఇటీవల ముగిసిన ఐపీఎల్, పీఎస్ఎల్ వంటి మ్యాచ్లు క్రికెట్ బోర్డులకు భారీ ఆధాయం తెచ్చిపడుతున్నాయి. దీంతో ఫిక్సర్లు ఇలా కూడా ఆటగాళ్లను లోబరచుకునేందుకు యత్నిస్తుండొచ్చని విశ్లేషకుల అంచనా.
2017-2018 సంవత్సరానికి సంబంధించి 1468 క్రికెటర్లు, సహాయక సిబ్బంది 12 అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలలో ఆడారు. వాటితో పాటుగా 2017 ఛాంపియన్ ట్రోఫీ, మహిళా వరల్డ్ కప్, ఆరు ఐసీసీ గ్లోబల్ ఈవెంట్స్లో పాల్గొన్నారు. వీరందరి నుంచి వివరాలు సేకరించే పనిలో పడింది ఐసీసీ అవనీతి నిరోధక శాఖ.