
పాకిస్థాన్ క్రికెటర్ అసిఫ్ అలీ కుమార్తె నూర్ ఫాతిమా (2) క్యాన్సర్ కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అలీ కూతురి మరణంపై టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన సచిన్.. ఈ ఘటనపై స్పందించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
సచిన్ మాట్లాడుతూ... 'రెండేళ్ల చిన్నారి మరణం చాలా బాధాకరం. చిన్నారి మరణం కారణంగా ఆ ఇంట్లో ఎంత విషాదం అలుముకుందో ఊహించగలను. అసిఫ్, అతడి భార్య, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కొందరు లేని లోటు తీర్చలేనిది. చిన్నారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అసిఫ్ కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలి. వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. క్రికెటర్గా ప్రస్తుతం సమయం అసిఫ్కు ఏంతో విలువైంది. ప్రపంచకప్ కోసం అసిఫ్ ఇంగ్లాండ్ వెళ్లినప్పటికీ.. అతడి ఆలోచనలు మాత్రం తన కూతురి చుట్టే ఉంటాయి' అని సచిన్ అన్నారు.
సచిన్ ప్రపంచకప్ సమరంలో ఉండగా.. అతనికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. 1999 ప్రపంచకప్ సమయంలోనే సచిన్ తండ్రి రమేశ్ టెండూల్కర్ మృతి చెందారు. ఆ బాధలో ఉన్నా కూడా కెన్యాతో జరిగిన మ్యాచ్లో సచిన్ సెంచరీ చేశారు. 1999 మే 23న జరిగిన ఈ మ్యాచ్లో సచిన్ 140 పరుగుల చేసి నాటౌట్గా నిలిచారు.