లండన్: భారత క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లగలిగే సామర్థ్యం కెప్టెన్ విరాట్ కోహ్లీకే ఉందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బోథమ్ అభిప్రాయపడ్డాడు. 2008లో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ.. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్య నిర్ణయంతో 2014లో టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత మూడేళ్ల వ్యవధిలోనే టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్గా మారిన విరాట్ .. టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్గా కొనసాగుతున్నాడు.
తాజాగా కోహ్లీ సారథ్యంపై ఇయాన్ బోథమ్ ప్రశంసల జల్లు కురిపించాడు.'ప్రత్యర్థుల నుంచి విరాట్ సులువుగా మ్యాచ్ని లాగేసుకుంటాడు. తన తోటి ఆటగాళ్లకు అతను అండగా ఉంటాడు. అతనితో మ్యాచ్ ఆడాలని నాకు ఎంతో ఆశగా ఉంది. ప్రస్తుతం టీమిండియాను ముందుకు నడిపించే సత్తా విరాట్ కోహ్లీకి మాత్రమే ఉంది' అని ఇయాన్ కొనియాడాడు. ఇక ఇంగ్లండ్ తరఫున 102 టెస్ట్లు, 116 వన్డేలు ఆడిన ఇయాన్.. రెండు ఫార్మాట్లలో 7,313 పరుగులు చేశాడు.
వాస్తవానికి 2008లోనే కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిరూపించుకున్నాడు. అప్పట్లో అండర్ -19 జట్టుకు కెప్టెన్సీ వహించిన విరాట్ కోహ్లీ.. భారత యువ జట్టుని విజేతగా నిలిపాడు. కానీ.. టీమిండియాలోకి వచ్చిన తొలినాళ్లలో వన్డేల్లో ఫర్వాలేదనిపించిన టెస్టుల్లో మాత్రం నిరాశపరిచాడు. ముఖ్యంగా 2014 ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టులాడి కేవలం 134 పరుగులే చేశాడు. కానీ ఆ తర్వాత ఐదు రోజుల ఫార్మాట్లోనూ జోరందుకున్న కోహ్లీ.. అదే ఇంగ్లండ్ గడ్డపై 2018లో శతకాల మోత మోగించి 593 పరుగులు చేశాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 20వేల పరుగుల మార్క్ని అందుకున్న బ్యాట్స్మెన్గా కొనసాగుతున్న విరాట్.. 86 టెస్టుల్లో 7,240 పరుగులు చేశాడు.
ఎగతాళి చేసిన పాక్ ఫ్యాన్సే నిలబడి చప్పట్లతో అభినందించారు: ధావన్