న్యూఢిల్లీ: భారత జట్టు ఎంపికలో కీలకంగా మారిన యో-యో ఫిట్నెస్ టెస్టుపై తనకు ఎలాంటి అభ్యంతరాల్లేవని మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2018 సీజన్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు సంపాదించిన అంబటి రాయుడు.. ఆ తర్వాత యో-యో టెస్టులో ఫెయిలవడంతో తన స్థానాన్ని సురేశ్ రైనాకి కోల్పోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత కొద్దిరోజుల పాటు ఫిట్నెస్పై దృష్టి పెట్టిన రాయుడు ఇటీవల అందులో పాసయ్యాడు. దీంతో.. భారత-ఎ జట్టు తరఫున ఆడేందుకు సెలక్టర్లు అవకాశం కల్పించారు. యో-యో ఫిట్నెస్ టెస్టు గురించి తాజాగా మీడియాతో రాయుడు మాట్లాడాడు.
'రెండు నెలల క్రితం యో-యో టెస్టులో ఫెయిలైనందుకు చాలా నిరాశ చెందాను. ఆ తర్వాత ఫిట్నెస్ మెరుగుపర్చుకుని ఇటీవల పాసయ్యా.. సెలక్టర్ల నుంచి పిలుపు కూడా వచ్చింది. భారత జట్టు తరఫున ఆడాలంటే క్రికెటర్ ఈ టెస్టులో పాసవ్వాలనే నిబంధన పెట్టడంపై నాకేమీ బాధలేదు. ఇంకా చెప్పాలంటే.. ఇప్పటికే ఆటగాళ్లు అందరూ ఆ స్థాయి ఫిట్నెస్ని అందుకోగలిగారు' అని అంబటి రాయుడు వెల్లడించాడు.
ఫిట్నెస్కే ప్రాధాన్యమిస్తున్న బీసీసీఐ ఇప్పటికే జట్టులో కొనసాగుతోన్న దినేశ్ కార్తీక్.. మురళీ విజయ్లను తప్పించి పృథ్వీ షా.. హనుమ విహారీలకు చోటిచ్చింది. పూర్తి ఫిట్నెస్తో సఫారీ పర్యటనకు భారత్ ఏ జట్టు తరపున ఇంగ్లాండ్ గడ్డపై పరుగులు పారిస్తున్న వీళ్లు టీమిండియా తరపున ఎన్నికవడం విశేషం.