
ఐదు కోట్లకు కనుగోలు
26 ఏళ్ల అక్షర్ పటేల్ను ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది వేలంలో ఐదు కోట్లకు కనుగోలు చేసింది. అయితే అక్షర్ తన ప్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గత సీజన్లో 10వికెట్లతో పాటు 110 పరుగులు చేశాడు. లాక్ డౌన్ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పాల్గొన్న అక్షర్ పటేల్ పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ముఖ్యంగా ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను ఆకాశానికి ఎత్తేశాడు.

అయ్యర్ స్పేచ్ఛనిస్తాడు
'భారత్-ఏ జట్టులోనూ శ్రేయస్ అయ్యర్తో కలసి ఆడా. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సులువుగా కలిసిపోయా. మైదానంలో శ్రేయస్ బౌలర్లకు స్వేచ్ఛనిస్తాడు. చాలా ఓపికతో ఉంటాడు. ఫీల్డింగ్ను మార్చుకునే వెసులుబాటు మన చేతుల్లోనే ఉంటుంది. శ్రేయస్ సారథ్యంలో ఆడడాన్ని చాలా ఎంజాయ్ చేశా. ఢిల్లీ క్యాపిటల్స్ నన్ను ఎంపిక చేసుకున్న సమయంలో చాలా సంతోషించా. ఎందుకంటే.. నేను ఇంతకు ముందు కలిసి ఆడిన వారే ఈ జట్టులో ఎక్కువ మంది ఉన్నారు' అని అక్షర్ పటేల్ తెలిపాడు.

వేలంలో బయమేసింది
'నేను పంజాబ్ ఫ్రాంచైజీతో ఐదేళ్ళు గడిపిన తర్వాతి వేలంలో బయమేసింది. నా భవిష్యత్తు ఎటుపోతుందో అర్ధం కాలేదు. అయితే వేలంలో ఢిల్లీ నన్ను తీసుకోవడంతో చాలా సంతోషించా, ఆ జట్టులో తెలిసిన వాళ్ళు ఉన్నారు. ప్రీ-సీజన్ క్యాంప్లో చేరిన మొదటి రెండు రోజులు కాస్త ఇబ్బందిపడ్డా, ఆ తర్వాత అంతా సెట్ అయింది. ఢిల్లీ ఫ్రాంచైజీతో నేను ఆడిన మొదటి సీజన్లో ఆ జట్టు ప్లే-ఆఫ్లోకి రావడం చాలా బాగుంది. మ్యాచ్లో బాగా ఆడిన ఆటగాడికి కోచ్ రికీ పాంటింగ్ ప్రత్యేక బ్యాడ్జ్ ఇచ్చేవాడు, దాన్ని నేను చాలాసార్లు గెలుచుకున్నా. అది వ్యక్తిగతంగా నాకు మంచి గుర్తింపుగా నిలిచింది' అని అక్షర్ చెప్పుకొచ్చాడు.

నాలుగో స్థానంలో శ్రేయస్ సరైనోడు
గత మూడేళ్లుగా టీమిండియాను ప్రధానంగా వేధిస్తున్న సమస్య మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. మ్యాచ్ విన్నర్లుగా భావించే కీలక స్థానాల్లో సరైన బ్యాట్స్మన్ లేక తీవ్ర ఇబ్బంది పడుతోంది భారత జట్టు. కొన్ని సందర్భాల్లో టాప్ఆర్డర్ విఫలమైతే ఇక జట్టును ఆదుకునే ఆటగాడే కరువయ్యాడు. అంబటి రాయుడు, అజింక్య రహానె, కేదార్ జాదవ్, దినేశ్ కార్తిక్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, మనీశ్ పాండే, రిషభ్ పంత్.. ఇలా ఎంత మందికి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ స్థానంలో మెరుస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. 18 వన్డేల్లో 748 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 8 అర్ధసెంచరీలున్నాయి.

ఐపీఎల్లోనూ తనదైన ముద్ర
శ్రేయస్ టీమిండియా తరఫునే కాకుండా ఐపీఎల్లోనూ తనదైన ముద్ర వేశాడు. 2015లో ఢిల్లీ జట్టు తొలిసారి అతడిని 2.6 కోట్లకు దక్కించుకుంది. అందుకు తగ్గట్టే శ్రేయస్ ఆ సీజన్లో 439 పరుగులతో మంచి ప్రదర్శన చేశాడు. తర్వాత 2018లో గౌతమ్ గంభీర్ తప్పుకున్నాక ఢిల్లీ జట్టు సారథిగా బాధ్యతలు అందుకున్నాడు. ఆ సీజన్లో 14 మ్యాచ్ల్లోనే 411 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక 2019లో బ్యాటింగ్లో రాణించడమే కాకుండా కెప్టెన్గానూ ప్రశంసలు అందుకున్నాడు. ఏడేళ్ల తర్వాత ఢిల్లీని ప్లేఆఫ్స్కు తీసుకెళ్లి జట్టులో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. ఇలా బ్యాట్స్మన్గానే కాకుండా కెప్టెన్గానూ అదరగొడుతున్నాడు.


Click it and Unblock the Notifications
