న్యూఢిల్లీ: నైపుణ్య పరంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మహిళల జట్లతో పోలిస్తే తమ జట్టు మెరుగైందని టీమిండియా టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. ఇటీవల ఆసీస్తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన టీమిండియా.. ప్రస్తుతం దృష్టంతా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్పైనే ఉందని తెలిపారు. అంతేకాక ఫిట్నెస్ కోసం ప్లేయర్లంతా తీవ్రంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
'గత రెండేళ్లలో మేం ఆటలో ఎంతో మెరుగుయ్యాం. అయితే ఆసీస్, ఇంగ్లాండ్ ఎప్పటినుంచో పటిష్ఠంగా ఉంటున్నాయి. వారితో పోల్చుకుంటే క్రికెట్లో మేం 5-6 ఏళ్లు వెనకబడి ఉన్నాం. గతంలో దేశవాళీ ప్లేయర్లు, అంతర్జాతీయ ఆటగాళ్లకు ఫిట్నెస్లో ఎంతో తేడా ఉండేది.
కానీ ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. ఇప్పుడు ఆటగాళ్లంతా ఆటతో పాటు ఫిట్నెస్ కోసం శ్రమిస్తున్నారు. అయితే దేశవాళీ స్థాయిలోనే ప్లేయర్లను పటిష్ఠంగా చేయాలి. కానీ అది ఆశించిన రీతిలో జరగట్లేదు. అందుకే ఆసీస్, ఇంగ్లండ్ కంటే అయిదారేళ్లు వెనకబడి ఉన్నాం'' అని హర్మన్ప్రీత్ వెల్లడించారు.
'ఫిట్నెస్ పరంగా ఆసీస్, ఇంగ్లండ్ సంప్రదాయాల్లో భాగం. కానీ మేం దానిపై ఆలస్యంగా దృష్టి సారించాం. గత మూడేళ్లలో దానిలో మెరుగవ్వడానికి మేం ఎంతో కృషి చేస్తున్నాం. అయితే రాత్రికే రాత్రి ఇది వచ్చేది కాదు. నిరంతర కృషితో సాధ్యమవుతుంది.
గతంలో ఆసీస్, ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ల్లో విజయానికి దగ్గరిగా వచ్చి ఓడిపోయాం. కానీ ఇప్పుడు ఆ జట్లపై ఘన విజయాలు సాధిస్తున్నాం. నైపుణ్యపరంగా వారి కంటే ఎంతో మెరుగైన బ్యాటర్లు, బౌలర్లు మా జట్టులో ఉన్నారు. సారథి బాధ్యతలతో నేను ఎంతో నేర్చుకున్నా'' అని తెలిపారు.