
ఇది నా జట్టు..
తాజా సిరీస్లో ఓపెనర్గా ప్రమోట్ చేసినా పంత్(6, 11) దారుణంగా విఫలమయ్యాడు. ఈ విజయానంతరం మీడియాతో మాట్లాడిన హార్దిక్ పాండ్యాను సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్లకు అవకాశం ఇవ్వకపోవడంపై రిపోర్టర్లు నిలదీయగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది తన జట్టు అని, ఎవరికి అవకాశాలు ఇవ్వాలో వద్దో అనేది తమ ఇష్టమని పేర్కొన్నాడు. 'ముందుగా మీకు ఒక విషయం స్పష్టం చేయాలనుకున్నా. బయట చాలా మంది జట్టు గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే వాళ్లు ఏం మాట్లాడినా అవి మా పై ఎలాంటి ప్రభావం చూపించవు.

భవిష్యత్తులో అందరికీ..
ఇది నా జట్టు. హెడ్ కోచ్ తో చర్చించిన తర్వాతే అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకుంటా. ఆ విధంగా ప్రణాళికలు, జట్టు వ్యూహాలు సిద్ధం చేసుకుంటాం. ఇంకా చాలా సమయం ఉంది. ముందు ముందు ప్రతీ ఒక్కరికీ అవకాశం వస్తుంది. ఈ సిరీస్ లో ఆడని వారికి భవిష్యత్లో మరో సిరీస్ ఆడే ఛాన్స్ ఉంటుంది. ఈ సిరీస్ చాలా చిన్నది. మరికొన్ని మ్యాచ్లుంటే అందరిని ఆడించే ప్రయత్నం చేసేవాళ్లం.
జట్టులో ఆరో బౌలింగ్ ఆప్షన్ ఉండాలనుకున్నాం. దానికి తగ్గట్లుగానే దీపక్ హుడాతో చేసిన ప్రయోగం ఫలితాన్ని ఇచ్చింది. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బ్యాటర్లు కూడా బౌలింగ్ చేయగలిగితే ఎక్కువ ఆప్షన్స్తో ప్రత్యర్థి జట్లను సర్ప్రైజ్ చేయగలుగుతాం'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.

అటాకింగ్ చేయడమే..
మూడో టీ20 టై అవ్వడంపై స్పందించిన హార్దిక్.. మ్యాచ్ పూర్తిగా జరుగుంటే గెలిచేవాళ్లమని చెప్పాడు. 'ఏదైనా మాకు మంచే జరిగింది. ఓ దశలో ఎదురుదాడికి దిగడమే ఈ వికెట్పై బెస్ట్ డిఫెన్స్ అనిపించింది. కివీస్ క్వాలిటీ బౌలింగ్ గురించి మాకూ పూర్తిగా అవగాహన ఉంది. అందుకే ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా ధాటిగా ఆడి 10-15 పరుగులు అదనంగా చేయడం ముఖ్యమని భావించాం.
ఇలాంటి మ్యాచ్లు మాలోని కొంతమంది ఆటగాళ్ల సత్తాకు పరీక్షగా నిలిచేవి. కానీ వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ ఆడలేకపోయాం. అది మన చేతుల్లో లేనిది. ఇక ఈ సిరీస్ విజయంతో నా పని పూర్తయ్యింది. హాయిగా ఇంటికెళ్లి ఈ విశ్రాంత్రి సమయాన్ని నా కొడుకుతో గడుపుతా'అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

సంజూకు చోటివ్వకుండా..
పదే పదే విఫలమవుతున్నా .. రిషభ్ పంత్ కు అవకాశాలివ్వడం, వచ్చే ప్రపంచకప్ లో ఆడతాడో లేదో తెలియని భువనేశ్వర్ ను ఆడించడం.. మరీ ముఖ్యంగా సంజూ శాంసన్కు జట్టులో చోటివ్వకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. వచ్చే 2024 టీ20 ప్రపంచకప్ కు జట్టును తయారుచేసుకునేందుకు గాను ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టిన టీమిండియా అందుకు తగిన విధంగా సన్నాహకాలు చేయడం లేదని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
టీ20లలో మెరుగైన రికార్డు లేని పంత్ ను కొనసాగించడం, ప్రతిభ ఉన్నా శాంసన్ ను పక్కనబెడుతుండటం, యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు అవకాశాలివ్వకపోవడంపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
